పత్తాలేకుండా పోయిన ఎంపీ మల్లారెడ్డి: ఉప్పల్ సంగీత అనూహ్య నిర్ణయం
హైదరాబాద్: భర్త, అత్త వారి ఇంటి నుంచి న్యాయం కోసం గత 51 రోజులుగా నిరసన దీక్ష చేపట్టిన సంగీత అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఆమరణ దీక్షకు సిద్ధమయ్యారు. ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నట్లు సోమవారం సాయంత్రం ప్రకటించారు.
Recommended Video
ఆస్తులు ఆయన పేరిటే: సంగీత కేసులో ఎంపీ మల్లారెడ్డి ట్విస్ట్
అదనపు వరకట్న వేధింపులకు తోడు ఆడపిల్ల పుట్టిందనే కారణంతో భర్త శ్రీనివాస్ రెడ్డి చిత్రహింసలకు గురిచేస్తూ సంగీతను ఇంటి నుంచి గెంటివేసిన విషయం తెలిసిందే. భార్య సంగీతకు తెలియకుండా మూడో వివాహం చేసుకున్నాడు.
సంగీత దీక్షకు మద్దతు కానీ
దీంతో గత ఏడాది నవంబర్ నెలలో బోడుప్పల్ సరస్వతి కాలనీలో భర్త ఇంటి వద్ద సంగీత నిరసన దీక్షకు దిగింది. సంగీతకు మద్దతుగా రాజకీయ పార్టీలు, మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు సంఘీభావం తెలిపాయి. ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా రంగంలోకి దిగి సమస్యను పరిష్కరించే ప్రయత్నం చేశారు.
సమస్యకు పరిష్కారం దొరకలేదు
కానీ సఫలం కాలేదు. దీంతో విసిగిపోయిన సంగీత ఆమరణ దీక్ష చేపడుతున్నట్లు ప్రకటించింది. భర్త శ్రీనివాస్ రెడ్డి, అత్త ఐలమ్మ, మామ బాల్రెడ్డిలు తనకు న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తానని ఆమె ప్రకటించారు. 50 రోజులుగా దీక్షలు చేస్తున్నా అత్తింటి నుంచి కాని, రాజకీయ పక్షాల నుంచి ఎలాంటి స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎంపీ పత్తాలేకుండా పోయారని ఆరోపణ
న్యాయం చేస్తామన్న మల్కాజిగిరి ఎంపీ మల్లారెడ్డి పత్తాలేకుండా పోయారని, తనకు ఆత్మహత్యే శరణ్యమన్నారు. తెలంగాణలో ఏ మహిళకూ అన్యాయం జరగకుండా చూస్తామని చెపుతున్న ప్రభుత్వం తన పట్ల ఎందుకు ఇంత నిర్దయగా వ్యవహరిస్తుందని ప్రశ్నించారు.
మరో పెళ్లిని ప్రశ్నించినందుకు
కాగా, సంగీత కేసు రెండు నెలల క్రితం సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. భర్త శ్రీనివాస్ రెడ్డి భార్య సంగీతను ఇష్టం వచ్చినట్లు కొట్టిన వీడియో మీడియాలో, సోషల్ మీడియాలో కలకలం రేపింది. మరో పెళ్లిని ప్రశ్నించినందుకు ఆమెను దారుణంగా కొట్టి గెంటివేశాడు.