corona lockdown: శవాన్ని సైకిల్ వెనుకసీటుపై పెట్టుకుని మార్చూరీకి తీసుకెళ్లాడు
హైదరాబాద్: కరోనా లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాల్లో విషాదకర ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. సరైన వాహన సదుపాయం లేకుండా పలువురు ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. కనీసం శవాన్ని తీసుకెళ్లడానికి కూడా ఏ వాహనం రాకపోవడంతో ఓ పారిశుద్ధ్య కార్మికుడు సైకిల్పై తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.
కామారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. కామారెడ్డిలోని గాంధీ గంజ్ ప్రాంతంలో నివాసం ఉండే ఓ వ్యక్తి మార్కెట్లో కూలీ పనిచేస్తుంటాడు. అయితే, అతనికి ఉన్న దీర్గకాలిక ఆరోగ్య సమస్యల వల్ల ఆదివారం ఉన్నట్టుండి చనిపోయాడు. దీంతో ఆ శవాన్ని అతని ఇంటికి చేర్చాల్సి వచ్చింది.
ముందుగా స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా, ఇది అనుమానాస్పద మృతి కాబట్టి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించాలని సూచించారు. అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించాలని భావించారు. ఆ శవాన్ని ఆస్పత్రి మార్చురీకి తరలించే బాధ్యతను ఓ పారిశుద్ధ్య కార్మికుడికి అప్పగించారు. ఏదైనా వాహనం కోసం చూశాడు, అంబులెన్స్ కోసం ఫోన్ చేశాడు ఆ కార్మికుడు.
అంబులెన్స్ కూడా అందుబాటులో లేకపోవడంతో చుట్టుపక్కల వారిని సాయం కోరి.. ఆ శవాన్ని తన సైకిల్పై ఎక్కించుకున్నాడు. మృతదేహాన్ని బట్టలో కట్టి, తన సైకిల్ వెనుకసీటుపై ఉంచి నెట్టుకుంటూ తీసుకెళ్లాడు. శవం పడిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ఆస్పత్రి మార్చూరీకి చేర్చాడు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.