సంక్రాంతి రద్దీ .. టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ ల బిజీ
ఏపీలో సంక్రాంతి పండుగకు పయనమయ్యారు తెలంగాణా రాష్ట్రంలోని హైదరాబాద్ కేంద్రంగా నివాసం ఉంటున్న , పని చేస్తున్న లక్షలమంది ప్రజలు. తెలుగు వాళ్ళు చాలా ఘనంగా జరుపుకునే సంక్రాంతి పండుగ సందర్భంగా హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు బయలుదేరిన ప్రయాణీకులు ట్రాఫిక్ జామ్ లతో పడరాని పాట్లు పడుతున్నారు .రైళ్ళు, బస్సులు, కార్లు ఒకటేమిటి అన్ని వాహనాలతో రహదారులు క్రిక్కిరిసిపోయాయి. ప్రతీ సంవత్సరం సంక్రాంతికి ఇలాగే రద్దీగా మారుతున్నా, ట్రాఫిక్ జామ్ లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా ప్రత్యామ్నాయం లేకపోవటం గమనార్హం.
సంక్రాంతి ప్రయాణాలతో విజయవాడ హైవే మీద ట్రాఫిక్ జామ్
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు విజయవాడ హైవే మీద ట్రాఫిక్ జామ్ కిలోమీటర్ల మేర అవుతుంది . తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ సంతోషంగా జరుపుకునే ఈ పండుగ కోసం తమ స్వగ్రామాలకు వెళ్లేందుకు అంతా ఒక్కసారే ప్రయాణాలు సాగించటమే అందుకు కారణం . ఇక రేపటి నుంచి విద్యా సంస్థలకు కూడా సెలవులు ఉండటంతో ఇక రద్దీ మరింత పెరగనుంది. విద్యార్థులు ఇప్పటి నుండే ఇంటిబాట పట్టారు. దీంతో హైదరాబాద్ నగరంలోని జేబీఎస్, ఎంజీబీఎస్, ఉప్పల్ బస్టాప్లు ప్రయాణీకులతో కిటకిటలాడుతున్నాయి .
టోల్ గేట్ల వద్ద కిలోమీటర్ల మేర నిలిచిన ట్రాఫిక్ .. పని చేయని ఫాస్టాగ్ స్కానర్లు
మరోవైపు హైదరాబాద్, విజయవాడ 65 నెంబర్ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజాల వద్ద కూడా వాహనాల రద్ధీ పెరిగింది. టోల్ గేట్ల వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ తో ప్రయాణికులకు పండుగ కష్టాలు మొదలయ్యాయి. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ గేట్ వద్ద భారీ ట్రాఫిక్ జామ్ అయ్యింది. తెలంగాణ, హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్లే వారికి నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్గేట్లో 8 టోల్ బూత్లను తెరిచారు. అయినప్పటికే టోల్ బూత్లో ఫాస్టాగ్ స్కానర్ సరిగా పనిచేయకపోవడంతో మళ్ళీ పాత రేట్ల ప్రకారం డబ్బులు తీసుకొని వాహనాలను పంపుతున్నారు.
అదనపు కౌంటర్లు తెరిచినా వాహనదారులకు కష్టాలే
మరోవైపు రహదారిపై ఎలాంటి ప్రమాదాలు జరగకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పోలీసులు యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్లను గుర్తించి బారికేడ్లు ఏర్పాటు చేశారు. పండుగ సందర్భంగా భారీగా వాహనాల రాకపోకలతో విజయవాడ జాతీయ రహదారిపైన ఉన్న టోల్ ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది .రహదారులు ఎక్కడ చూసినా వాహనాల బారులతో దర్శనం ఇస్తున్నాయి. టోల్ ప్లాజాల వద్ద విపరీతం అయిన రద్దీ నెలకొన్న నేపధ్యంలో అదనపు కౌంటర్లను తెరిచినా వాహనదారులకు ఇబ్బందులు తప్పటం లేదు .