సంక్రాంతి ఎఫెక్ట్... హైదరాబాద్లో కిక్కిరిసిన బస్టాండ్లు,రైల్వే స్టేషన్లు.. మరో రెండు స్పెషల్ ట్రైన్స్
సంక్రాంతి పండుగ నేపథ్యంలో హైదరాబాద్లో బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు కిక్కిరిసిపోతున్నాయి. పండుగకు జనం సొంతూళ్ల బాట పట్టడంతో సికింద్రాబాద్,నాంపల్లి,కాచిగూడ రైల్వే స్టేషన్లలో విపరీతమైన రద్దీ నెలకొంది. జనం తాకిడి పెరగడంతో కోవిడ్ 19 దృష్ట్యా అందుకు తగిన ఏర్పాట్లు చేశారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఇప్పటికే పలు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయగా తాజాగా మరో రెండు అదనపు రైళ్లను ఏర్పాటు చేసింది.
ఈ నెల 17న నర్సాపూర్-సికింద్రాబాద్(07441),కాకినాడ టౌన్-సికింద్రాబాద్(07457) ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. 17వ తేదీ రాత్రి 8గంటలకు నర్సాపూర్లో బయలుదేరే రైలు మరుసటిరోజు ఉదయం 6.05గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. పాలకొల్లు,భీమవరం జంక్షన్,ఆకివీడు,కైకలూరు,గడివాడ,విజయవాడ,గుంటూరు,పిడుగురాళ్ల,మిర్యాలగూడ,నల్గొండ స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
కాకినాడ టౌన్-సికింద్రాబాద్ మధ్య ఈ నెల 17న నడిచే రైలు... ఆరోజు సాయంత్రం 6గంటలకు కాకినాడలో బయలుదేరుతుంది. మరుసటిరోజు ఉదయం 5.20గంటలకు సికింద్రాబాద్ స్టేషన్కు చేరుతుంది. సామర్లకోట,ద్వారపూడి,రాజమహేంద్రవరం,నిడదవోలు,తాడేపల్లిగూడెం,ఏలూరు,రాయనపాడు,ఖమ్మం,కాజీపేట స్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.
అటు బస్సుల్లోనూ విపరీతమైన రద్దీ నెలకొంది. తెలంగాణ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్కు వెళ్తున్నవారితో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ కొనసాగుతోంది. చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద 16 గేట్లకుగాను 10 గేట్ల నుంచి వాహనాలను విజయవాడ వైపు పంపుతున్నారు. గత రెండు రోజుల్లో 80 వేలపైగా వాహనాలు పంతంగి టోల్ ప్లాజా గుండా వెళ్లినట్లు నిర్వాహకులు తెలిపారు.
హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కు వెళ్లే ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండటంతో దాదాపు 3607 సంక్రాంతి ప్రత్యేక సర్వీసులను ఏపీఎస్ఆర్టీసీ నడపనుంది. హైదరాబాద్ నుంచి ఏపీలోని అన్ని జిల్లాలకు సర్వీసులు నడపనుంది. ప్రత్యేక బస్ సర్వీసులకు ముందస్తు ఆన్లైన్ రిజర్వేషన్ సదుపాయం కల్పించారు.
ఇక పండుగ వేళ ప్రైవేట్ ట్రావెల్స్ ప్రయాణికులను నిలువు దోపిడీ చేస్తున్నాయి. ఆర్టీసీ బస్సుల్లో వసూలు చేసే చార్జీల్లో సగం చార్జీని ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు అదనంగా వసూలు చేస్తున్నారు. హైదరాబాద్-రాజమండ్రి ఆర్టీసీ బస్సు చార్జీ రూ.600 ఉండగా ప్రత్యేక బస్సు సర్వీసులో రూ.900 వరకు ఉంది. అదే ప్రైవేట్ ట్రావెల్స్లో రూ.1400-రూ.1600వరకు వసూలు చేస్తున్నారు.