సారిక, పిల్లల మృతి కేసు: సిరిసిల్ల రాజయ్య భార్యపై సస్పెన్షన్ వేటు
వరంగల్: మాజీ పార్లమెంటు సభ్యుడు సిరిసి ల్ల రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనుమళ్ల అనమానాస్పద మృతి కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న కాకతీయ విశ్వవిద్యాలయంలోని ఆర్ట్స్అండ్సైన్స్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న సిరిసిల్ల మాధవి సస్పెన్షన్కు గురయ్యారు. 28 రోజలపాటు జైలు జీవితం అనుభవించిన అనంతరం యూనివర్సిటీ అధికారులు ఎట్టకేలకు బుధవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
అరెస్టయిన 27రోజల అనంతరం కేయూ ఇన్చార్జి వీసీ టి.చిరంజీవులు మాధవిని నవంబర్ 5నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బుధవారం సాయంత్రం ఉత్తర్వులను జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న ఎవరైనా అరెస్ట్ అయి 48గంటలపాటు ఖైదీగా ఉన్నట్లయితే ఆ ఉద్యోగిని విధుల నుంచి తొలిగించాలనే నిబంధన ఉన్నప్పటికీ యూనివర్సిటీ అధికారులు మాత్రం రిమాండ్ రిపోర్ట్ పేరుతో కాలయాపన చేశారని అంటున్నారు.
కాగా పోలీసులు ఇటీవల అందచేసిన రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా కేయూ రిజిస్ట్రార్ ప్రొ. ఖాజాఅల్తాఫ్ హుస్సేన్ నివేదికను సిద్ధం చేసి ఇన్చార్జి వీసీకి పంపించారు. ఈ విషయంలో ఎలాంటి జాప్యం లేకుండా వీసీ చిరంజీవులు మాధవిని అరెస్ట్ అయిన నవంబర్ 5నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు.
మాధవి సిర్పూర్ కాగజ్నగర్లోని ఓ ఎయిడెడ్ కాలేజీలో లెక్చరర్గా పనిచేస్తూ 2010లో కాకతీయ విశ్వవిద్యాలయం బయోటెక్నాలజీ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా నియమితులయ్యారు. క్యాంపస్లోని బయో టెక్నాలజీ విభాగంలో రెండేళ్ల పాటు పనిచేసిన తర్వాత హన్మకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీకి బదిలీ అయ్యారు.