ఇంకా దొరకని సనా: ఆమెతో విశాఖలో సారిక భర్త అనిల్ కాపురం
వరంగల్: మాజీ పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య కోడలు, ఆమె ముగ్గురు కుమారుల మృతి కేసులో నాలుగో నిందితురాలైన సనా ఇంకా దొరకలేదని వరంగల్ పోలీసు కమిషనర్ జి. సుధీర్ బాబు చెప్పారు. ఆమె కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయని ఆయన చెప్పారు.సనాను పోలీసులు అరెస్ట్ చేసినట్లు ఆదివారం వార్తలు వచ్చాయి. ఇప్పటికే ఈ కేసులో నేరారోపణ ఎదుర్కొంటున్న అనిల్, రాజయ్య, మాధవిలను అరెస్ట్ చేసి రిమాండ్ చేశారు.
న్యాయమూర్తి ముగ్గురికి 14 రోజుల శిక్ష విధించారు. నాలుగో నిందితురాలు అనిల్ రెండో భార్య సనా పరారీలో ఉన్నట్లు పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో తెలిపారు. ప్రత్యేక పోలీస్ బృందం అధికారులు ఎట్టకేలకు సనాను ఖమ్మం జిల్లాలో అరెస్ట్ చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. సనా, ఇద్దరు పిల్లలు, సోదరుడు సద్ధామ్ను అదుపులోకి తీసుకున్న వరంగల్కు తీసుకువచ్చి కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్లో ఉంచినట్లు కూడా ఆ వార్తలు తెలిపాయి.
కాగా, అనిల్ రెండో భార్య సనాతో విశాఖపట్నంలో కాపురం పెట్టినట్లు తెలిసింది. రాజయ్య ఎంపీగా గెలిచిన తర్వాత కాజీపేటకు చెందిన సనా స్థానిక పనుల నిమిత్తం తరచు వీరి ఇంటికి వచ్చేది. దీంతో అనిల్తో ఏర్పడిన పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసిందనే ఆరోపణలున్నాయి. అప్పటికే అనిల్కు సారికతో పెండ్లికాగా ఓ కొడుకు కూడా ఉన్నాడు.
యువజన నాయకుడైన అనిల్ తండ్రి రాజయ్య రైల్వే బోర్డు మెంబర్గా చేశాడు. దీంతో అనిల్ రైల్వే కాంట్రాక్ట్ పనులు చేసేవాడు. అప్పట్లో విశాఖపట్నంలో కాంట్రాక్ట్ వర్క్ చేస్తున్నందున సనాతో అక్కడే కాపురం పెట్టినట్లు తెలిసింది. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం. విషయం తెలుసుకున్న సారిక భర్త అనిల్, అత్తమామలను ప్రశ్నించడంతో గొడవలు మొదలయ్యాయి.
నాటి నుంచి రాజయ్య కుటుంబ సభ్యుల నుంచి సారికకు వేధింపులు, చిత్రహింసలు నిత్యకృత్యమయ్యాయి. వేధింపులు తట్టుకోలేక సారిక పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసింది.