సారిక, పిల్లలు అనుమానాస్పద మృతి: రాజయ్య భార్య మాధవిపై సస్పెన్షన్ వేటు?
వరంగల్: వరంగల్లోని కాకతీయ విశ్వవిద్యాలయంలో బయోటెక్నాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య భార్య సిరిసిల్ల మాధవిపై సస్పెన్షన్ వేటు పడే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల అనుమానాస్పద మృతి నేపథ్యంలో మాధవిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తన కోడలు సారిక, ముగ్గురు మనవళ్లు అభినవ్, అయోన్, శ్రీయోన్ మాజీ ఎంపీ సిరిసిల్ల ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తెలిసిందే. తన అత్తింటి వేధింపులు భరించలేక, ముఖ్యంగా అత్త వేధింపులు భరించలేని స్థితిలో ఉన్నానని కోడలు సారిక ఫిర్యాదుతో గతంలో 498 (ఏ)తో పాటు గృహహింస కేసు నమోదైన విషయం కూడా తెలిసిందే.
బుధవారం జరిగిన సంఘటనపై పోలీసులు ఆమె భర్త సిరిసిల్ల రాజయ్య, కొడుకు అనిల్తో పాటు ఆమెను అరెస్టు చేసి, న్యాయమూర్తి ఎదుట హాజరుపరచగా వారికి 14 రోజుల రిమాండ్ నిమిత్తం వరంగల్ కేంద్ర కారాగారానికి తరలించారు.
ఈ నేపథ్యంలో వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్న మాధవిని విధుల నుంచి తప్పించే అవకాశాలున్నట్టు యూనివర్శిటీ అధికారులు చెపుతున్నారు. అయితే శుక్రవారం వర్సిటీ వీసీ చిరంజీవులు రానున్న నేపథ్యంలో ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని వర్సిటీ వర్గాలు పేర్కొంటున్నాయి.