సారిక కేసు తీవ్రత దృష్ట్యా రాజయ్యకు, ఫ్యామిలీకి బెయిల్ ఇవ్వని కోర్టు
వరంగల్: సంచలనం సృష్టించిన మాజీ పార్లమెంటు సభ్యుడు సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ఆమె ముగ్గురు పిల్లల మృతి కేసులో నిందితులు రాజయ్య, ఆయన భార్య మాధవి, కొడుకు అనిల్ కుమార్లకు బెయిల్ ఇచ్చేందుకు న్యాయస్థానం నిరాకరించింది.
తాజాగా వీరు రెండోసారి బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వీరు రెండోసారి దరఖాస్తు చేసుకున్న బెయిల్ పిటిషఖన్, ప్రధాన నిందితుడు అనిల్ కుమార్ తొలిసారి ఇచ్చిన పిటిషన్లను కేసు తీవ్రత దృష్ట్యా కోర్టు తిరస్కరించింది.
రాజయ్య దంపతులు, అనిల్ కుమార్లు వేర్వేరుగా బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకున్నారు. వీరి బెయిల్ పిటిషన్లను రెండో అదనపు జిల్లా న్యాయస్థానం గురువారం నాడు కొట్టివేసింది. రెవెన్యూ కాలనీలోని రాజయ్య ఇంట్లో తన కోడలు సారిక, ముగ్గురు పిల్లలు సజీవదహనమైన విషయం తెలిసిందే.
ఈ సంఘటన నవంబర్ 4వ తేదీన జరిగింది. ఇప్పటికే రాజయ్య, ఆయన భార్య మాధవిలు కోర్టులో పెట్టుకున్న బెయిల్ పిటిషన్ను నవంబర్ 18వ తేదీన కోర్టు కొట్టేసింది. తాజాగా, వారి బెయిల్, ప్రధాన నిందితుడు అనిల్ కుమార్ బెయిల్ను కూడా కొర్టు కొట్టేసింది.