కంటి చూపు కరువై...: చేతులు దులిపేసుకున్న డాక్టర్లు, బాధ్యులెవరు?
హైదరాబాద్: శస్త్రచికిత్స కారణంతో రోగులు కంటి చూపు కోల్పోవడంపై హైదరాబాదులోని సరోజినీ దేవి కంటి ఆస్పత్రి వైద్యులు తమ తప్పేమీ లేదని చేతులు దులిపేసుకున్నారు. కంటి ఆపరేషన్ల విషయంలో తన నిర్లక్ష్యం ఏమీ లేదని చెప్పారు. బ్యాక్టీరియా సోకడం వల్లే చూపు కోల్పోయారని వారు చెప్పారు.
డాక్టర్లు రోగులకు హాని చేయరని, వారిని కాపాడాలనే చూస్తారని వారు చెప్పారు. తమపై కేసులు పెట్టడం సరికాదని సరోజిని వారన్నారు. తమపై కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. తమపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు.
టీఎస్ఎంఐడీసీ సంస్థను రద్దు చేయాలని డాక్టర్లు కోరారు. టీఎస్ఎంఐడీసీ సంస్థలో గత ఐదేళ్లుగా క్వాలీటీ కంట్రోల్ పోస్టును భర్తీ చేయలేదని చెప్పారు. మందులపై నిఘా లేకపోవడంతోనే తప్పిదాలు జరిగాయని వైద్యులు అంటున్నారు. సెంట్రల్ డ్రగ్ స్టోర్ నుంచి మందులు సరఫరా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఐవీ ఫ్లూయిడ్స్ను హసీబ్ అనే సంస్థ సరఫరా చేసిందని ఇందులో తమ తప్పు ఏ మాత్రం లేదని సరోజిని వైద్యులు అంటున్నారు. అయితే, తప్పు ఎవరిదనేది ఇప్పుడు వివాదంగా మారింది.
హెచ్చార్సీ ఆగ్రహం
సరోజనీదేవి కంటి ఆస్పత్రి ఘటనపై హెచ్ఆర్సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆస్పత్రిలో చికిత్స పొందిన పలువురు చూపు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటికే దర్యాప్తు ప్రారంభం కాగా తాజాగా హెచ్ఆర్సీ సైతం ఘటనను సుమోటోగా స్వీకరించింది.
నివేదిక ఇవ్వాలని ఆదేశాలు
సరోజినీదేవి ఆస్పత్రి ఘటనపై జూలై 21లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, మెడికల్ అండ్ హెల్త్ ప్రిన్సిపాల్ సెక్రటరీకి అదేవిధంగా సరోజనీదేవి ఆస్పత్రి సుపరెంటెండెంట్ లక్ష్మికి హెచ్చార్సీ నోటీసులు జారిచేసింది.
బాధ్యులు ఎవరు
సరోజినీ దేవి కంటి ఆస్పత్రి ఘటనకు బాధ్యులెవరనేది ఇప్పుడు తేలాల్సి ఉంది. ఇన్ఫెక్షన్ సోకిన మందును సరఫరా చేసిన కంపెనీదా, వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణమా, ఆస్పత్రిలో శుభ్రత పాటించకపోవడం కారణమా అనే విషయాలపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఇప్పుడే చెప్పలేం..
పరీక్ష కోసం పంపిన నమూనాల ఫలితాలు రాకుండా తుది నిర్ణయానికి రాలేమని నిపుణులు చెబుతున్నారు. దీనికి కంపెనీ సరఫరా చేసిన సెలైన బాటిళ్లే కారణమంటూ వైద్యులు ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.
ఫ్లూయిడ్స్పై నిషేధం
వివాదానికి కారణమైన హసీబ్ కంపెనీకి సంబంధించి మొత్తం ఫ్లూయిడ్స్పై నిషేధాన్ని ప్రకటించారు. ఈ మేరకు డ్రగ్ కంట్రోలర్ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ మందుల నిల్వ కేంద్రాలపై శుక్రవారం తనిఖీలు నిర్వహించారు.
మరో వివాదం..
ఈ స్థితిలో తాత్కాలిక అవసరాలకు 2లక్షల ఆర్ఎల్ సెలైన బాటిళ్లను కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్థితిలో మరో వివాదం ముందుకు వచ్చింది.
ఫలితాలు రావడానికి సమయం..
సెలైన బాటిళ్లలో బ్యాక్టీరియా ఉందో, లేదో తెలుసుకోవడానికి జరిపే కల్చర్ పరీక్ష ఫలితాలు రావడానికి కనీసం 10 నుంచి 14 రోజుల సమయం పడుతుందని అంటున్నారు. కానీ సంఘటన జరిగిన రెండో రోజే వైద్యులు బ్యాక్టీరియా కారణమంటూ నిర్ణయానికి వచ్చారు.
ప్రభుత్వానికి రెండు నివేదికలు..
సరోజినీ ఆస్పత్రి సంఘటనపై ఇప్పటికే ప్రభుత్వానికి రెండు పరస్పర విరుద్ధమైన నివేదికలు అందినట్లు తెలుస్తోంది. ఆస్పత్రి వర్గాలు చెప్పిన సమాచారం ఆధారంగా వైద్య విద్య డైరెక్టర్ డాక్టర్ రమణి ఒక నివేదికను అందజేయగా, టీఎ్సఎంఎ్సఐడీసీ ఎండీ వేణుగోపాల్ మరో నివేదికను అందజేశారు.
ఎవరికి వారు తప్పించుకోవడానికే...
సరోజినీ దేవీ కంటి ఆస్పత్రి ఘటన నేపథ్యంలో బాధ్యతల నుంచి తప్పించుకోవడానికి ఎవరికి వారు ప్రయత్నిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.
లోకాయుక్త విచారణ..
శుక్రవారం సాయంత్రం లోకాయుక్త డిప్యూటీ డైరెక్టర్ (ఇన్వెస్టిగేషన్) అధికారి మహ్మద్ తాజొద్దీన్, ఇన్వె్స్టగేషన్ అధికారి సుధాకర్రెడ్డిలతో కూడిన బృందం ఘటనపై విచారణ చేపట్టింది. ఆస్పత్రిలో ఉన్న చూపు కోల్పోయిన ఐదుగురు రోగులను విచారించారు. విధుల్లో ఉన్న డీఎంవో డాక్టర్ పద్మప్రభను విచారించారు.