జాతీయ జెండాను తగలబెట్టాడు.. రిపబ్లిక్ డే వేడుకల్లో దారుణం..
రాష్ట్రంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరగ్గా.. మహబూబాబాద్ జిల్లాలో మాత్రం అపశృతి చోటు చేసుకుంది. కురవి మండలం తిరుమలపురంలో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో గ్రామ సర్పంచ్ సోదరుడు జాతీయ జెండాను తగలబెట్టాడు. దీంతో పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.
వివరాల్లోకి వెళ్తే..రిపబ్లిక్ డే సందర్భంగా తిరుమలపురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శి జాతీయ జెండాను ఎగరవేశారు. అయితే గ్రామ సర్పంచ్ రాంబాబు లేకుండానే జెండాను ఎగరవేయడంపై అతని సోదరుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. అక్కడున్నవారిని దూషించడమే కాకుండా.. జాతీయ జెండాను కిందపడేసి నిప్పంటించాడు. దీనిపై పోలీసులకు సమాచారం అందించడంతో.. అతన్ని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కాగా,రాష్ట్రవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్లో ఆదివారం ఉదయం గవర్నర్ తమిళసై సౌందరరాజన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా త్రివిధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సౌందర రాజన్.. కొత్తగా ఏర్పడిన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ పనితీరు అద్భుతంగా ఉందని కొనియాడారు. ఎన్నో అంశాల్లో తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు.
ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి గ్రామాలు అభివృద్ది చెందుతుందున్నాయని అన్నారు. కొత్త రెవెన్యూ చట్టంతో రాష్ట్రంలో అవినీతికి తావు లేని స్వచ్చమైన రెవెన్యూ పాలన అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ప్రభుత్వ పథకాలైన మిషన్ భగీరథ, 24 గంటల కరెంటు, కొత్త సాగునీటి ప్రాజెక్టులు సత్ఫలితాలను ఇస్తున్నాయన్నారు.