దారితప్పిన సమీక్ష, ఓటమి కారకులే చేస్తారా: సంచలన వ్యాఖ్యలు, కాంగ్రెస్ నుంచి సర్వే సస్పెన్షన్
హైదరాబాద్: మల్కాజిగిరి నియోజకవర్గ సమావేశం ఆదివారం రసాభాసగా ముగిసింది. చివరకు పార్టీ సీనియర్ నేత సర్వే సత్యనారాయణను సస్పెండ్ చేసే వరకు వెళ్లింది. ఇటీవలి అసెంబ్లీ సమావేశ ఫలితాలపై పార్టీ నేతలు నేతలు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఇక్కడి నుంచి పోటీ చేసిన సర్వే సత్యనారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొన్ని రౌడీమూకలు ఉన్నాయని విమర్శించారు. తాను అంటే గిట్టని వారు అల్లరిమూకలను తన పైకి ఉసిగొల్పారన్నారు.
రేపు (సోమవారం మరిన్ని వివరాలు ప్రకటిస్తానని చెప్పారు. పార్టీలో ఏం జరుగుతుందో చెప్తానని అన్నారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, పార్టీ ఇంచార్జ్ కుంతియాలు తమాషా చూస్తున్నారన్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. పీసీసీ మీద చర్య తీసుకోవాలని తాను అధిష్టానాన్ని కోరుతానని చెప్పారు.
అందుకే ఓడిపోయాం: చంద్రబాబు వైపు టీ-కాంగ్రెస్ నేతల వేలు, లేదు.. కొన్నిచోట్ల గెలిచాం!
ఓటమికి కారణమైన వారే సర్వే నిర్వహిస్తే ఎలా
తన ఓటమికి కారణమైన వారే సమీక్ష నిర్వహిస్తే ఎలా అని సర్వే సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభ్యర్థులకు డబ్బులు కూడా ఇవ్వలేదని, వాటిని ఏం చేసారని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలకు పార్టీ నేతలు మహేష్, బొల్లు కిషన్ అడ్డుపడ్డారు. దీంతో సర్వే సత్యనారాయణ సమావేశం నుంచి ఆగ్రహంతో వెళ్లిపోయారు. ఓ సమయంలో బొల్లు కిషన్, సర్వేల మధ్య మాటల యుద్ధం నడిచింది. బొల్లు కిషన్ పైన సర్వే వాటర్ బాటిల్ విసిరేశారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేస్తానని సర్వే చెప్పారు.
సర్వేను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి: బొల్లు కిషన్
సర్వే సత్యనారాయణను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బొల్లు కిషన్ డిమాండ్ చేశారు. తన చొక్కా చింపి, వీధి రౌడీలా వ్యవహరించారని ధ్వజమెత్తారు. ఉత్తమ్, కుంతియాలపై అసభ్యకరంగా మాట్లాడారని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీ నుంచి సర్వే సస్పెండ్
సర్వే సత్యనారాయణను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మల్కాజిగిరి నియోజకవర్గ సమావేశంలో కుంతియా, ఉత్తమ్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని వేటు వేశారు. సమావేశంలో బొల్లు కిషన్ పైన వాటర్ బాటిల్ కూడా విసిరారు.