టిఆర్ఎస్ ఎంపీ దయాకర్ ఎన్నికపై హైకోర్టుకు సర్వే: చీఫ్ జస్టిస్తో కెసిఆర్ భేటీ
హైదరాబాద్: వరంగల్ ఎంపీగా తెలంగాణ రాష్ట్ర సమితి నేత పసునూరి దయాకర్ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్నేత, మాజీ ఎంపీ సర్వే సత్యనారాయణ హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు.
నామినేషన్ దాఖలు చేసే నాటికి దయాకర్కు భారత్ పెట్రోలియం కార్పొరేషన్లో ఎల్పీజీ పంపిణీకి ఒప్పందం ఉందని.. దయాకర్ భార్య ఎల్పీజీ పంపిణీదారుగా ఉన్నారని పేర్కొన్నారు.
ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధన ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థలతో ఒప్పందం ఉన్నవారు పోటీకి అనర్హులని పిటిషన్లో పేర్కొన్నారు. ఎన్నికలో దయాకర్ సమర్పించిన ప్రమాణపత్రంలో సమాచారం తప్పుగా ఇచ్చారని ఎన్నికల అధికారులకు తెలిసినా.. నామినేషన్ స్వీకరించారని వివరించారు.
హైకోర్టు చీఫ్ జస్టిస్తో సిఎ కెసిఆర్ భేటీ
హైకోర్టు చీఫ్ జస్టిస్ దిలీప్ భోంస్లేతో మంగళవారం సాయంత్రం ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్రావు భేటీ అయ్యారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చీఫ్ జస్టిస్తో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ముఖ్యమంత్రి చీఫ్ జస్టిస్తో భేటీ కావడానికి ఎలాంటి ప్రాధాన్యత లేదని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు పేర్కొంటున్నాయి. సిఎం కెసిఆర్ నిర్వహించిన అయుత చండీయాగానికి చీఫ్ జస్టిస్ హాజరు కావడంతో మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారని ఆ వర్గాల తెలిసింది.