మహాకూటమి అధికారంలోకి వస్తే నేనే ముఖ్యమంత్రిని, కనీసం...: సర్వే సంచలనం
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం, కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జన సమితిలతో కూడిన మహాకూటమి గెలిస్తే తానే ముఖ్యమంత్రిని అని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెరాస గెలిస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు.
కానీ మహాకూటమి గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారనే అంశం చర్చనీయాశంగా మారింది. గతంలో బండ్ల గణేష్ నల్గొండ జిల్లాలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తరఫున ప్రచారం చేస్తూ.. ఆయనను భారీ మెజార్టీతో గెలిపిస్తే ముఖ్యమంత్రి అవుతారని చెప్పారు.
ముఖ్యమంత్రులు మారుతారని తెరాస సెటైర్లు
కూటమిలో ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థో చెప్పాలని తెరాస నేతలు డిమాండ్ చేస్తున్నారు. అమరావతిలోని చంద్రబాబు, ఢిల్లీలోని రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తారని విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో జిల్లాకో ముఖ్యమంత్రి ఉన్నారని, వారికి అధికారం ఇస్తే అయిదేళ్లలో నలభై మంది ముఖ్యమంత్రులు మారుతారని కేటీఆర్ కూడా విమర్శలు గుప్పించారు.
నగ్మాతో కలిసి సర్వే ప్రచారం
మహాకూటమిలో అంతర్గతంగా ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై పోటా పోటీ నెలకొని ఉందనే వాదనలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో సర్వే సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాశంగా మారాయి. ఆయన కంటోన్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. మంగళవారం తన నియోజకవర్గంలో సినీ నటి నగ్మాతో కలిసి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
దళితుడిని సీఎం చేస్తామని నిర్ణయిస్తే నేనే
ఎన్నికల్లో తమ కూటమి అధికారంలోకి వస్తే తాను ముఖ్యమంత్రిని అవుతానని చెప్పారు సర్వే సత్యనారాయణ. తెరాస అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని కేసీఆర్ మాట ఇచ్చి, తప్పారని చెప్పారు. ఒకవేళ కాంగ్రెస్ అధిష్ఠానం దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తానని నిర్ణయిస్తే దళితుడైన తనకు ఆ అవకాశం రావొచ్చనని అన్నారు.
కనీసం డిప్యూటీ సీఎం లేదా మంత్రి
కనీసం డిప్యూటీ ముఖ్యమంత్రి పదవి అయినా వస్తుందని సర్వే సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు. అదీ లేకుంటే మంత్రిని అయినా అవుతానని చెప్పారు. తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సమస్యలు లేని నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.