కాళ్లు మొక్కి తెలంగాణ తెచ్చాం, అందుకే ఓడాం: సర్వే, ఫ్లెక్సీ చించివేత
హైదరాబాద్: మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సర్వే సత్యనారాయణ మంగళవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నేతలు ముఖ్యమంత్రి పదవి కోసం పోటీ పడటం వల్లనే తాము గత సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోయామన్నారు.
ఇతర పార్టీల పార్లమెంటు సభ్యుల కాళ్లు మొక్కి తమ పార్టీ నేతలు తెలంగాణ రాష్ట్రం తీసుకు వచ్చారని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు త్వరలో జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నేతలు వరుసగా భేటీ అవుతున్నారు. త్వరలో గ్రేటర్ హైదరాబాదులో భారీ బహిరంగ సభను నిర్వహించాలని సర్వే సూచించారు.
అంజన్ ఫోటో లేదని హల్ చల్
హైదరాబాద్ నగర కాంగ్రెస్ పార్టీలో మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ అభిమానులు హల్ చల్ సృష్టించారు. ఫ్లెక్సీలో అంజన్ ఫోటో లేదని వారు దానిని చించివేశారు.
సెక్షన్-8 తెర పైకి రావడం దుర్మార్గం: తుమ్మల
సెక్షన్-8ను తెర పైకి తీసుకురావడం దుర్మార్గమని తెలంగాణ రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని కాలరాసే ప్రయత్నమన్నారు. నీతిమాలిన రాజకీయాల నుంచి బయటపడేందుకే చంద్రబాబు ఈ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
ఇటువంటి చిల్లర కార్యక్రమాలకు పోతే మరోసారి పరువుపోవడం ఖాయమన్నారు. స్వర్థ రాజకీయాల కోసం ప్రజాస్వామ్యాన్ని కాలరాసే ప్రయత్నం జరిగిందన్నారు. చంద్రబాబు ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.