డాక్టర్ల కాల్పుల ఘటనలో మలుపులు: శశికుమార్, ఉదయ్ మధ్య కోటి వివాదం
హైదరాబాద్: హైదరాబాదులోని హిమాయత్నగర్లో జరిగిన డాక్టర్ల కాల్పుల ఘటనకు ఆర్థిక లావాదేవీలే కారణమని పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చారు. కోటి రూపాయల వివాదమే కాల్పుల ఘటనకు, ఆ తర్వాత శశికుమార్ మృతికి దారి తీసినట్లు భావిస్తున్నారు.
కాల్పుల ఘటన తర్వాత అక్కడి నుంచి పారిపోయిన డాక్టర్ సాయి కుమార్ను పోలీసులు నారాయణగుడా పోలీసు స్టేషన్లో ఐదు గంటల పాటు విచారించారు. ఈ సందర్భంగా పలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉదయ్ కుమార్ శశికుమార్ను డైరెక్టర్ల బోర్డు నుంచి తప్పించారని చెబుతున్నారు.
డా. శశికుమార్ ఆత్మహత్య: పోలీసులకు మిత్రుడి భార్య ఫిర్యాదు (పిక్చర్స్)
వివరాలు ఈ విధంగా ఉన్నాయి - మాదాపూర్లోని ఆస్పత్రిలో శశికుమార్ 75 లక్షల రూపాయలు పెట్టుబడిగా పెట్టారు. మరో 25 లక్షల రూపాయలు డాక్టర్ ఉదయ్ కుమార్కు అప్పుగా ఇచ్చాడు. ఆ డబ్బులకు ఉదయ్ నెలనెలా వడ్డీ ఇస్తానని చెప్పాడు. ఇంతలో డైరెక్టర్ల బోర్డు నుంచి ఉదయ్ శశికుమార్ను తప్పించాడు. ఆ స్థానంలో ప్రసాద్ అనే వ్యక్తిని నియమించాడు.
తనను సీఈవోగా నియమించాలని, ఆస్పత్రి బాధ్యతలు తనకు అప్పగించాలని శశికుమార్ పట్టబట్టాడు. దానివల్ల శశికుమార్కు నెలకు రూ. 3.5 లక్షల రూపాయలు వేతనంగా ఇవ్వాల్సి వస్తుందని ఉదయ్ కుమార్ భావించి అందుకు నిరాకరించాడు. ఈ వివాదం ఏడాది కాలంగా నడుస్తోంది.
ఈ నేపథ్యంలోనే చర్చల కోసమంటూ శశికుమార్ను సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు పిలిచారు. హోటల్లో వాగ్వివాదం జరిగింది. బయటకు వచ్చి ఒకే కారులో బయలుదేరారు. అక్కడ కూడా గొడవ జరిగింది. ఈ పరిస్థితిలో కాల్పుల ఘటన చోటు చేసుకుంది.
ఇదిలావుంటే, తన భర్తను కిడ్నాప్ చేసి, హత్య చేశారని, ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించారని శశికుమార్ భార్య క్రాంతి ఆరోపిస్తున్నారు. అయితే, ఉదయ్పై కాల్పులు జరిగిన రివాల్వర్, శశికుమార్ ఆత్మహత్యకు ఉపయోగించిన రివాల్వర్ ఒక్కటేనని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అది శశికుమార్కు చెందిన లైసెన్స్డ్ గన్. అది 2012 నుంచి శశికుమార్ వద్ద ఉంటోందని ఆయన కుటుంబ సభ్యులు చెబుతున్నారు.