గవర్నర్ మార్పుపై ఊహాగానాలు: నరసింహాన్ స్ధానంలో జస్టిస్ సదాశివం?
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహాన్ను కేంద్రం తప్పించనుందనే ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి. నరసింహాన్ పనితీరుతో కేంద్రం గుర్రుగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజ్ భవన్లో ‘ఎట్ హోం' పేరిట నరసింహన్ ఇచ్చిన తేనీటి విందుకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబునాయుడు, కల్వకుంట్ల చంద్రశేఖరరావులు ఇద్దరూ హాజరు కాలేదు.
దీంతో నొచ్చుకున్న గవర్నర్ నరసింహాన్ తనను ఈ బాధ్యతలను తొలగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి అంశంలో తెలంగాణ వైపే మొగ్గు చూపుతున్నారంటూ నరసింహాన్పై ఏపీ ప్రభుత్వం పలుమార్లు కేంద్రానికి కూడా ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.
దీంతో నరసింహాన్ను గవర్నర్ పదవి నుంచి తప్పించాలని ఏపీ ప్రభుత్వం పట్టుబడుతోంది. మరోవైపు ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్య కుదరాలని, పునర్విభజన చట్టంలోని ప్రతి అంశం నెరవేరాలని కూడా కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది.
ఇది జరగాలంటే న్యాయపరమైన అంశాలపై పట్టు ఉన్న వ్యక్తులైతే బాగుంటుందనే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి, ప్రస్తుతం కేరళ గవర్నర్గా పనిచేస్తున్న జస్టిస్ సదాశివం అయితే ఇందుకు సరిగ్గా సరిపోతారని కూడా కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం.
పై కారణాలన్నింటి దృష్ట్యా నరసింహాన్ స్ధానంలో జస్టిస్ సదాశివంను నియమించే దిశగా కేంద్రం అడుగులేస్తుందనే ఊహాగానాలు మళ్లీ ఊపందుకున్నాయి.