ప్రాణాల మీదకు తెచ్చిన ఏకగ్రీవం..! మనస్తాపంతో అభ్యర్థి మృతి..!!
కోరుట్ల / హైదరాబాద్ : పంచాయతీ ఎన్నికలు అంటేనే గ్రామాల్లో అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకుంటారు గ్రామస్తులు. పోటీ చేసే అభ్యర్థులు కూడా అంతే పట్టుదలగా వ్యవహరిస్తుంటారు. పంచాయతీ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా ఆపాదించుకుంటారు. అందుకు తగ్గట్టే గ్రమాల్లో బేరసారాలు, ఏకగ్రీవాలు, మాట మంతి జరిగిపోంతుంటాయి. అభ్యర్ధి ఏకగ్రీవం కోసం అనేక మంతనాలు, మనీ, మద్యం ప్రభావం కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇక ఒక పంచాయతీలో అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలంటే ఎంతో కొంత బేరాలు ఉంటాయి. అభ్యర్థి కూడా అందుకు సమ్మతించి అందుకు తగ్గ ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అభ్యర్థి ఏకగ్రీవం కోసం అయ్యే ఖర్చును మొత్తం భరించాల్సి ఉంటుంది. అదే క్రమంలో గ్రామస్తులు, అభ్యర్థికి మద్య విబేదాలు వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. కొన్న సందర్బాల్లో అభ్యర్థుల ప్రాణాలమీదకు వచ్చిన సంఘటనలు కూడా చోటు చేసుకుంటాయి. ఇదే సంఘటన తాజాగా ఓ అభ్యర్థి ప్రాణాలు కోల్పోయేలా చేసింది.
ఏకగ్రీవం వ్యవహారం ఓ సర్పంచ్ అభ్యర్థి ప్రాణాల మీదకు తెచ్చింది. సర్పంచ్ పీఠం దక్కాలంటే పది లక్షలు డిమాండ్ చేసిన గ్రామకమిటీ. ముందస్తుగా ఐదు లక్షలు చెల్లించాలని ఒప్పందం కూడా కుదుర్చుకుంది. మొదటి విడతగా రెండు లక్షలు చెల్లించినా, మిగతా వాటి కోసం పట్టుబట్టడంతో మనస్తాపం చెందిన సదరు అభ్యర్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఓబులాపూర్ తండాలో సోమవారం జరిగింది.
ఈ తండా ఇటీవలే కొత్త గ్రామ పంచాయతీగా ఆవిర్భవించింది. తొలిసారి పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 275 మంది ఓటర్లు కలిగిన ఈ తండాలో ఆరు వార్డులుసహా సర్పంచ్, ఉపసర్పంచ్ పదవులను ఏకగ్రీవం చేసుకుందామని గ్రామస్తులు నిర్ణయించుకున్నారు. ఇదే క్రమంలో ఇలాంటి సంఘటన జరిగే సరికి గ్రామస్తులు ఆవాక్కయ్యారు. రానున్న రోజుల్లో పంచాయతీ ఎన్నికలు ముగిసే సరికి ఇంకెంత మంది ప్రాణాలు కోల్పోతారోనని గ్రామల్లో చర్చ జరుగుతోంది.