‘సత్యం’ స్కాం: రామలింగరాజు, మరో ముగ్గురిపై 14ఏళ్లపాటు నిషేధం, రూ.813కోట్లు చెల్లించండి: సెబి
న్యూఢిల్లీ: దాదాపు పదేళ్ల కిందటి సత్యం కంప్యూటర్స్ కుంభకోణంలో సెక్యూరిటీస్ ఎక్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబి) సంచలన ఆదేశాలు జారీ చేసింది. చట్టవిరుద్ధంగా ఆర్జించిన రూ.813కోట్లను తిరిగి చెల్లించాలంటూ 'సత్యం' కంపెనీ వ్యవస్థాపకుడు రామలింగరాజు తోపాటు ఆయన సోదరులు రామరాజు, సూర్యనారాయణరాజు, ఎస్ఆర్ఎస్ఆర్ హోల్డింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్లను సెబి ఆదేశించింది.
అంతేగాక, 14ఏళ్లుపాటు సెక్యూరిటీస్ మార్కెట్ కార్యకలాపాల్లో పాలుపంచుకోకుండా వీరిపై నిషేధం విధించింది. అయితే, ఈ 14ఏళ్ల నిషేధ కాలంలో ఇప్పటికే పూర్తయిన కాలం కూడా కలిసి ఉంటుంది. సెక్యూరిటీస్ అపీలేట్ ట్రిబ్యూనల్ సూచనల ప్రకారం సెబి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
కాగా, గతంలో ఆదేశించిన రూ.1,258.88 కోట్ల మొత్తాన్ని తాజాగా రూ.813.40కోట్లకు తగ్గించింది. ఇందులో ఎస్ఆర్ఎస్ఆర్ హోల్డింగ్స్ రూ.675కోట్లు, రామలింగ రాజు దాదాపు రూ.27కోట్లు, సూర్యనారాయణ రాజు రూ.82కోట్లు, రామరాజు సుమార రూ.30కోట్లు చెల్లించాల్సి ఉంటుంది. సత్యం కుంభకోణం వెలుగులోకి వచ్చిన 2009, జనవరి 7 నుంచి 12శాతం వార్షిక వడ్డీరేటుతో 45రోజుల్లోగా ఈ మొత్తాన్ని చెల్లించాలి.