శబరిమలలో అసలు మహిళా వివక్ష ఎక్కడ? హోటల్స్లో సిగరేట్ తాగేవాళ్లే: సత్యవాణి ఏం చెప్పారంటే?
హైదరాబాద్: శబరిమల అంశంపై భారతీయం సత్యవాణి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. పలు ఉదాహరణలు చెప్పి అసలు మహిళా వివక్ష ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఇప్పుడు జరుగుతోందంతా ఓ కుట్ర అని అభిప్రాయపడ్డారు. కేసులు వేసిన మహిళలకు భక్తి ఉంటే ఇంట్లో, ఊళ్లో పూజ చేసుకోవచ్చు కదా అన్నారు. వారిది భక్తి కాదన్నారు.
శబరిమల ఆలయంలోకి మహిళలు వెళ్లే అంశం అసలు కోర్టు పరిధిలోనిది కాదనని సత్యవాణి చెప్పారు. అయ్యప్పస్వామి నైస్థిక బ్రహ్మచారి అన్నారు. అయ్యప్ప విషయంలో స్త్రీ ప్రమేయమే లేదని చెప్పారు. అయ్య.. అప్ప.. రెండు పేర్లు మాత్రమే ఉన్నాయని, అంటే తండ్రికి, తండ్రికి మధ్య ఉదయించినవాడు అన్నారు. అక్కడ స్త్రీ ప్రమేయమే లేదన్నారు. అయ్య అన్న తండ్రే, అప్ప అన్న తండ్రే అన్నారు. మహేశ్వరుడికి, విష్ణుమూర్తికి కలిసి ఉదయించినవాడు అయ్యప్పస్వామి అన్నారు.
అయ్యప్పస్వామి ఇంద్రియాలను జయించినటువంటి జితేంద్రీయుడు అని సత్యవాణి చెప్పారు. ఆయన వద్దకు పదేళ్ల నుంచి అరవయ్యేళ్ల వయస్సు గల మహిళలు వెళ్లకపోవడానికి కారణాలు ఉన్నాయని చెప్పారు. శబరిమల పెద్ద అడవిలో ఉందని, అక్కడకు అక్కడకు మహిళలు వెళ్లడం ఇబ్బందికరమని అభిప్రాయపడ్డారు. అలాగే, ఇంద్రియ నిగ్రహం పొందేందుకు ఎంతోమంది సాధకులుగా వెళ్తుంటారని చెప్పారు. స్త్రీని చూసి ఆ సాధకులు డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. విశ్వామిత్రుడు సాధన చేసే సమయంలో రంభ, మేనకలను డిస్టర్బ్ చేసేందుకే పంపించారని సత్యవాణి గుర్తు చేశారు.
ఆ సమయంలో తేజోవలయం
రసజ్వల సమయంలో మహిళలకు శరీరం చుట్టూ తేజోవలయం ఉంటుందని, అలా నడుచుకుంటూ వెళ్తే అది డిస్టర్బ్ అవుతుందని సత్యవాణి చెప్పారు. శబరిమల ఆలయంలోకి మహిళలు వెళ్తున్నారని, పదేళ్లలోపు కన్నెసాములు, యాభయ్యేళ్ల తర్వాత మహిళలు వెళ్తున్నారని చెప్పారు. కాబట్టి కేవలం ఆ వయస్సులోని మహిళలను ఎందుకు వద్దంటున్నారనే విషయం అర్థం చేసుకోవాలని చెప్పారు. అది అరణ్య ప్రదేశం, రసజ్వల సమయం ఇబ్బందులు, సాధకుడిని డిస్టర్బ్ చేయకుండా ఉండేందుకు.. ఇలా ఎన్నో కారణాలు ఉన్నాయన్నారు. కాగా, ఆలయంలోకి వెళ్లేవారు నలభై రోజులు శుద్ధిగా ఉండాలనే విషయం తెలిసిందే.
అసలు మహిళా వివక్ష ఎక్కడ ఉంది?
శబరిమలలోకి వెళ్లేందుకు మహిళా వివక్ష ఎక్కడ కనిపిస్తోందని సత్యవాణి ప్రశ్నించారు. ఎందుకంటే కన్నె మహిళలు, యాభయ్యేళ్లకు పైగా మహిళలు వెళ్తారని, అలాంటప్పుడు లేడీ వివక్ష ఎక్కడ కనిపించిందన్నారు. కావాలని ఎవరో దీనిని రాద్దాంతం చేశారన్నారు. కుట్రపూరితంగా వ్యవహరించారని చెప్పారు. అయ్యప్ప దీక్ష తీసుకున్న స్వాములకు ఎంతో నిష్ఠతో తల్లి లేదా భార్యనే వండుతారని, ఇరుముడి కట్టుకున్న తర్వాత కూడా మాల ధరించిన వ్యక్తిలో స్వామిని చూసుకొని, పాదాలకు నమస్కరిస్తారని సత్యవాణి చెప్పారు. ఇందులో ఎంతో ఔన్నత్యం, లోతైన అర్థం ఉందని చెప్పారు. వ్యసనాలకు దూరంగా ఉండాలని, తాను మంచిగా ఉండాలని ఎంతోమంది అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుంటారని చెప్పారు.
అక్కడ ఆచారం
శబరిమల పరిస్థితి, ఆ వ్రత నియమాలు, అక్కడి పరిస్థితులు, అయ్యప్పస్వామి నైస్థిక బ్రహ్మచారి.. వీటన్నింటిని ఆధారంగా అనాధిగా ఆచారం ఉందని, కానీ ఎక్కడా మహిళా వివక్ష లేదని సత్యవాణి చెప్పారు. హనుమంతుడు కూడా బ్రహ్మచారి అని, ఆంజనేయుని దీక్ష తీసుకుంటే ఎవరూ గంధమాదన పర్వతానికి వెళ్లడం లేదని, అందుకే ఈ నియమాలు పెట్టలేదోమోనని అభిప్రాయపడ్డారు. కాబట్టి ఆ ప్రశ్నే లేదన్నారు.
మహిళలే ఎదురు తిరిగారు
సంప్రదాయాన్ని గౌరవించే మహిళలు ఎవరూ శబరిమల ఆలయంలోకి వెళ్లేందుకు ఇష్టపడరని సత్యవాణి చెప్పారు. అందుకే కేరళలో మహిళలే కేరళ ప్రభుత్వానికి, సుప్రీం కోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఎదురు తిరిగారని, ఆందోళనలు చేశారన్నారు. ఎవరి ఆచార వ్యవహారాలు వారికి ఉంటాయని, వాటిని పాటించాలన్నారు. అందులో సైన్స్ కూడా ఉందన్నారు. నిజంగా భక్తి ఉన్నవారు బలంగా వాదించి, నేను వెళ్తాను అంటారా.. అది భక్తి అవుతుందా అన్నారు. అయ్యప్పస్వామిపై నీకు నిజంగానే భక్తి ఉంటే నీ ఇంట్లోనే స్వామివారిని పెట్టుకొని పూజించుకోవాలని, దగ్గరలోని అయ్యప్ప ఆలయాల్లోకి వెళ్లాలని సూచించారు. స్థానికంగా ఉండే అయ్యప్ప ఆలయాల్లోకి ఎంతమంది మహిళలు వెళ్లడం లేదన్నారు. కానీ ఆ ఒక్క ఆలయం (శబరిమల) వద్ద ఆ చరిత్ర ఉందని చెప్పారు. ఒక్కో ఆలయానికి ఒక్కో చరిత్ర ఉంటుందని, దానిని పాటించాలన్నారు. భిన్నత్వంలో ఏకత్వమే భారతీయత అన్నారు.
కొంతమంది చేస్తున్న కుట్ర
మన సంప్రదాయాన్ని, భారతీయతను విదేశాల్లో బాగా ఇష్టపడుతున్నారని, విదేశీయులు అలా అభిమానించడాన్ని తట్టుకోలేక కొంతమంది చేస్తున్న కుట్రనే శబరిమల ఇష్యూ అన్నారు. అసలు అలా వెళ్లి ఫైట్ చేసిన వారు నిజమైన భక్తులు కాదని, సనాతన ధర్మాన్ని ఆచరించే మహిళలు కాదని చెప్పారు. పైగా అలాంటి వారు హోటల్స్కు వెళ్లి సిగరేట్ తాగుతూ, డ్రింక్స్ తాకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేసులు వేసింది కూడా అలాంటి యువతులే అన్నారు. ఆసుపత్రిలోని ఐసీయూలోకి వెళ్లేముందు మనకు ఇన్ఫెక్షన్ సోకకుండా యాప్రాన్ ఇస్తారని, డాక్టర్ ఆపరేషన్ చేసే సమయంలో ముక్కుకు మాస్క్ ధరిస్తారని, ఇలా ఎవరి నియమ నిబంధనలు వారికి ఉంటాయన్నారు. కామన్సెన్స్ లేకుండా వ్యవహరిస్తారా అన్నారు.
హిందువులు విశాల హృదయులు
హిందువులు విశాల హృదయులు అని, అందుకే హిందూధర్మం అంటే అందరికీ చులకన అని సత్యవాణి చెప్పారు. మన దగ్గర అందరికీ స్వేచ్ఛ ఉందని చెప్పారు. అందరినీ కడుపులో పెట్టుకొని ఆదరిస్తామన్నారు. మన దేశం ఓ ధర్మసత్రమని, అందరికీ దారి ఇచ్చి గడియ తీసేశామని, ఎవరైనా చొచ్చుకు రావొచ్చునని, ఎవరు ఏదైనా చేయవచ్చుననే స్వేచ్ఛ ఉందన్నారు. ఇదే పూజించాలని, ఈ దేవుడినే ఆదరించాలనే కండిషన్ లేదన్నారు. ఈ విశాలత్వాన్ని ఆధారంగా చేసుకొని హిందుత్వంపై దాడి చేస్తున్నారు. ఈ దాడిపై యువత, హిందువులు.. ముఖ్యంగా భారతీయులు అప్రమత్తం కావాలన్నారు. ఇలాంటి అంశాలపై అసలు చర్చలే పెట్టవద్దని చెప్పారు. దారినపోయేవారు ఎంతో మొరుగుతుంటే పట్టించుకోవద్దన్నారు. దానిని పట్టించుకొని, చర్చించుకోవడం అనవసరమన్నారు.