సత్యవతి రాథోడ్ రాజకీయ ప్రస్థానం: సర్పంచ్ స్థాయి నుంచి తొలి మహిళా మంత్రి వరకు
హైదరాబాద్: సత్యవతి రాథోడ్ రాజకీయంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న నాయకురాలు. సర్పంచ్ స్థాయి నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె.. తెలంగాణ రాష్ట్రంలో రెండోసారి అధికారం చేపట్టిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో నేడు కేబినెట్ విస్తరణలో భాగంగా మంత్రి పదవిని చేపట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఆమె ధన్యవాదాలు తెలిపారు.
గుండ్రాతిమడుగులో..
వరంగల్ జిల్లా కురవి మండలంలోని గుండ్రాతిమడుగులో 1969, అక్టోబర్ 31న లింగ్యానాయక్, దశమి దంపతులకు సత్యవతి రాథోడ్ జన్మించారు. అక్కడే ఆమె ఏడవ తరగతి వరకు చదివారు. ఆ తర్వాత 1982, మే 5న గోవింద రాథోడ్తో సత్యవతి వివాహం జరిగింది. వీరికి సునీల్, సతీష్ అనే ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. కాగా, 2009, జులై 20న గోవింద్ రాథోడ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భర్త మరణంతో కుటుంబ బాధ్యతలను కూడా తానే తీసుకున్నారు సత్యవతి రాథోడ్.
సర్పంచ్గా పదవి చేపట్టి..
రాజకీయ ప్రస్థానం గురించి ప్రస్తావించుకున్నట్లయితే.. సత్యవతి 1984లో రాజకీయ ప్రవేశం చేశారు. 1985లో జిల్లా తెలుగు మహిళా విభాగానికి అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. 1988-1991 వరకు పంచాయతీ రాజ్ పరిషత్ సభ్యురాలిగా పనిచేసింది. 1996లో గుండ్రాతిమడుగు సర్పంచ్గా పనిచేశారు. 1989లో టీడీపీ తరపున సత్యవతి రాథోడ్.. కాంగ్రెస్ తరపున డీఎస్ రెడ్యా నాయక్ పోటీ చేయగా.. రెడ్యా నాయక్ గెలుపొందారు.
2009లో అసెంబ్లీకి ఎన్నిక..
2007లో నర్సింహులపేట జడ్పీటీసీగా కూడా ఆమె పనిచేశారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరపున సత్యవతి రాథోడ్.. కాంగ్రెస్ పార్టీ నుంచి రెడ్యా నాయక్, బీజేపీ నుంచి పరశురాం నాయక్, ప్రజారాజ్యం పార్టీ నుంచి బానుతో సుజాత పోటీ చేయగా.. సత్యవతి రాథోడ్ గెలుపొందారు. 2009-14 వరకు ఆమె డోర్నకల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగారు.
టీడీపీ నుంచి టీఆర్ఎస్లోకి...
ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం 2014లో టీడీపీ నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరారు సత్యవతి రాథోడ్. ప్రస్తుతం శాసనమండలి సభ్యురాలిగా ఉన్న సత్యవతి రాథోడ్ను తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ పార్టీ అధినేత కే చంద్రశేఖర్ రావు తాజాగా మంత్రివర్గ విస్తరణలో భాగంగా రాష్ట్ర కేబినెట్లోకి తీసుకున్నారు. రెండోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రి వర్గంలోకి మహిళలను తీసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సత్యవతి రాథోడ్ తోపాటు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి కూడా కేబినెట్ బెర్త్ ఖాయం చేశారు గులాబీ బాస్.
తొలి మహిళా మంత్రిగా ఆనందం..
తనను మంత్రివర్గంలో చేర్చుకోవడంపై సత్యవతి రాథోడ్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లకు ఆమె కతృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ కేబినెట్లో తొలిసారి మహిళకు మంత్రిగా అవకాశం కల్పించడం, గిరిజన మహిళ అయిన తనకు ఈ ఘనత ఇవ్వడం పట్ల తనకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఆమె ఈ సందర్బంగా చెప్పారు. నిజాయితీగా పనిచేసి తన సమర్థతను నిరూపించుకుంటానని అన్నారు.