ఓ పక్క తుపాను అంటున్నారు.. మరి ఈ భగభగలు ఏంది సామీ..! 48 డిగ్రీలకు చేరుకున్న ఎండలు..!!
Recommended Video
హైదరాబాద్ : ఓ పక్క తుపాను అంటూనే మరో పక్క ఎండలు మండిపోతున్నయి. ఎండ తీవ్రతకు తెలంగాణలోని జిల్లాల ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో తెలంగాణ అగ్నిగుండాన్ని తలపిస్తుంది. ఆదివారం 45.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా కనిష్ట ఉష్ణోగ్రత 32.5 డిగ్రీలుగా నమోదైంది. ఈ ఏడాది ఇదే అత్యధికం. గరిష్ట ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలకు చేరకుంటుంటే కనిష్ట ఉష్ణోగ్రతలు సైతం 35 డిగ్రీలకు చేరుతున్నాయి. దీంతో రాత్రిపూట కూడా వేడిగాలుల ప్రభావం చూపుతోంది. మూడు రోజులుగా భానుడు నిప్పులు చెరుగుతుండడంతో జనాలు బయటికి రావడానికి భయపడుతున్నారు.
భానుడి భగభగ..! బయటకు వెళ్లేందుకు జంకుతున్న జనం..!!
గాలిలో తేమశాతం తగ్గడంతో ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు ప్రజలు. ఉమ్మడి జిల్లాలో వడదెబ్బదాటికి మార్చి నుంచి ఇప్పటి వరకు 22 మంది మృతి చెందారంటే పరిస్థితి ఎవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. రోజుకు ఒకరిద్దరు చొప్పున వడదెబ్బకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. బొగ్గుబావులు, ఓపెన్కాస్టులు ఉన్న ప్రాంతాల్లో ఆదివారం మధ్నాహ్నం ఉష్ణోగ్రతలు 47 నుంచి 48 డిగ్రీలకు చేరుకున్నాయి.
ఉమ్మడి జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు..! ఇప్పటికే వడదెబ్బతో 22 మంది మృతి..!!
దీంతో ఓపెన్ కాస్టుల్లో విధులు నిర్వహిస్తున్న కార్మికులు అల్లాడిపోయారు. అడవులు అంతరిస్తుండటం, జలాశయాలు అడుగంటడం.. తదితర కారణాల వల్ల ఎండ తీవ్రత ఏటేటా పెరుగుతోంది. సాయత్రం 6 గంటలు దాటితే కాని జనాలు బయటికి రాని పరిస్థితి. వాహన చోదకులు ముఖానికి రక్షణ లేకుండా బయటకు రావడం లేదు.
ఇప్పుడే ఇలా ఐతే..! రేపు మే నెలలో ఎలా..?
అడవుల జిల్లాగా పెరుగాంచిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడం ఆందోళన కలిగిస్తోంది. ఏటా మే నెలలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. వాగులు, బోరు బావులుల్లో నీరు అడుగంటుతున్నాయి. గ్రామాల్లో తీవ్ర నీటిఎద్దడి తలెత్తుతోంది. మే నెలలో ఎండల తీవ్రత ఏ విధంగా ఉంటుందోనని ప్రజలు బెంబెలెత్తిపోతున్నారు.
భానుడు బ్యాండ్ బాజా..! బెంబేలెత్తుతున్న జనం..!!
ఇదే నెలలో అత్యధికంగా పెళ్లిళ్లు ఉన్నాయి. ఇటు ఎండలతో ఇళ్లలో ఉక్కపోతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజురోజుకు పెరుగుతున్న ఎండల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లేవారు కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోకుంటే ప్రమాదాల బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.