రావద్దు: లాస్ట్ మినట్లో కేసీఆర్కు షాకిచ్చిన మోడీ: తెరాస ఆరా, రాజకీయమా?
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు పీఎంవో నుంచి చివరి నిమిషంలో షాక్ తగిలింది.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు పీఎంవో నుంచి చివరి నిమిషంలో షాక్ తగిలింది. ఎస్సీ వర్గీకరణ కోసం కేసీఆర్ నేతృత్వంలో ప్రధానితో జరగనున్న అఖిల పక్ష భేటీ చివరి నిమిషంలో రద్దయింది!
మందకృష్ణకు చెక్!: మోడీ వద్దకు తీసుకెళ్తున్న కేసీఆర్, వైసిపికి లేని పిలుపు
పీఎంవో నుంచి తెలంగాణ ప్రభుత్వానికి శనివారం రాత్రి సమాచారం అందింది. ఎస్సీ వర్గీకరణ కోసం ఫిబ్రవరి 6వ తేదీన అఖిల పక్షంతో ప్రధానిని ముఖ్యమంత్రి కలవాల్సి ఉంది.
అయితే, ప్రస్తుతానికి ఆ భేటీను వాయిదా వేస్తున్నట్లు సీఎంవోకు పీఎంవో నుంచి సమాచారం వచ్చింది. తదుపరి తేదీని ఖరారు చేస్తామని పేర్కొన్నారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీ బయలుదేరేందుకు సిద్ధమవుతుండగా.. ఇది తెరాసకు, కేసీఆర్కు షాక్ అని చెప్పవచ్చు.
తెరాస ఆరా
ప్రధాని అకస్మాత్తు నిర్ణయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ విస్మయం చెందారు. దీంతో ఆయన ఢిల్లీ పర్యటన రద్దుకు నిర్ణయయించుకున్నారు. దీనివెనుక కారణాలపై ఆరా తీస్తున్నట్లుగా తెలుస్తోంది. భేటీ రద్దుకు రాజకీయ పరమైన కారణాలున్నాయని తెరాస భావిస్తోంది.
శాసనసభ సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా గతవారం ప్రధాని మోడీ భేటీని కోరారు. భేటీని ఖరారు చేస్తూ శుక్రవారం ఉదయం పీఎంవో నుంచి సమాచారం అందింది. ఆరోతేదీన ఉదయం భేటీకి రావాలని సూచించింది. ఇందుకోసం కేసీఆర్ అన్ని పార్టీలకు లేఖలు రాశారు.
'మోడీకి భయపడుతున్న కేసీఆర్', 'రద్దుతో అదానీ-అంబానీలకే ప్రయోజనం'
ఐదో తేదీ నుంచి నాలుగు రోజుల పాటు ఢిల్లీ పర్యటనకు ఆయన నిర్ణయించారు. ఎస్సీ వర్గీకరణతో పాటు రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, వివిధ పథకాలకు సంబంధించిన అంశాలను మోడీ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోరాలనుకున్న తరుణంలో భేటీ రద్దు కావడంతో తెరాస వర్గాలను కొంత నిరాశకు గురి చేసింది.
ఎస్సీ వర్గీకరణతో పాటు పలు అంశాలపై ప్రధాని మోడీతో చర్చించాలని భావించారు. ఓయూ వందేళ్ల ఉత్సవాలకు ప్రధానిని ఆహ్వానించాలని భావించారు. కాగా, అఖిలపక్ష భేటీ జరిగితే ఎస్సీ వర్గీకరణ అంశంపై మొత్తం క్రెడిట్ కేసీఆర్కు దక్కుతుందనే ఉద్దేశ్యంతో కొందరు ఈ భేటీని రద్దు చేయించారనే వాదనలు వినిపిస్తున్నాయి. రాజకీయ రద్దు అంటున్నారు. క్రెడిట్ అంతా కేసీఆర్కు వెళ్లకుండా చెక్ చెప్పేందుకే కొందరు ఇలా చేశారంటున్నారు.