కోమట్లు పుస్తకంపై దళిత సంఘాల ఆగ్రహం, కంచ ఐలయ్యపై అట్రాసిటీ కేసు
రచయిత కంచ ఐలయ్య పైన దళిత సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రవ్యాప్తంగా పలువురు దళిత నాయకులు ఆయనపై మండిపడుతున్నారు.
హైదరాబాద్: రచయిత కంచ ఐలయ్య పైన దళిత సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ, ఏపీ రాష్ట్రవ్యాప్తంగా పలువురు దళిత నాయకులు ఆయనపై మండిపడుతున్నారు.
చదవండి: కంచ ఐలయ్యకు ఏపీ పోలీసులు షాక్, నోటీసులు: సభపై తగ్గిన ఆర్యవైశ్య సంఘాలు
లక్ష కోట్లు ఇస్తే మతం మార్చేస్తా అంటావా
లక్ష కోట్లు ఇస్తే దళితులను మతం మార్చేస్తానని వ్యాఖ్యానించడంపై ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర నాయకుడు దొంతమల్లు రాంబాబు నిప్పులు చెరిగారు. ఈ మేరకు ఆయన జవహర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
కోమట్లు పుస్తకంపై ఎస్సీ, ఎస్టీల ఆగ్రహం
అంతేకాదు, సామాజిక స్మగ్లర్లు కోమటోళ్ల పుస్తకంపై వైశ్య సంఘాలతో పాటు ఎస్సీ, ఎస్టీ హక్కుల పరిరక్షణ సమితి మండిపడింది. ఈ పుస్తకంలో శూద్రులు నల్లగా ఉంటారని రాసిన వ్యాఖ్యలు తమ దళితులను అవమానించేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఐలయ్యపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు
కంచ ఐలయ్య రాసిన పుస్తకంలో తమను అవమానించారని రాంబాబు ఫిర్యాదు చేయడంతో దర్యాఫ్తు చేసిన పోలీసులు ఐలయ్య పైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతో పాటు మత విద్వేషాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యానించినందుకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
టైటిల్ విషయంలో మద్దతు తెలపలేం
ఇదిలా ఉండగా, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్.. కంచ ఐలయ్య పుస్తకంపై ఓ ఇంటర్వ్యూలో స్పందించారు. కోమటోళ్లు పుస్తకం విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, ఈ పుస్తకం టైటిల్ విషయంలో మద్దతు తెలపలేనటువంటి పరిస్థితి అని చెప్పారు.
కోమట్లను స్మగ్లర్లు అనడం సరికాదు
మా ఇంట్లోనే కోమట్లు కిరాయికి ఉంటున్నారని, మా ఇంట్లో కొట్టుపెట్టుకుని ఉండాల్సిన అవసరం వాళ్లకి వచ్చిందని, అంటే, దళితుల ఇంట్లోనే కోమట్లు కిరాయికి తీసుకుని బతుకు జీవుడా! అంటూ బతికిన రోజులు చూశానని, తన క్లాస్ మేట్స్ కోమట్లు ఉన్నారని, ప్రభుత్వం ఇచ్చిన స్కాలర్షిప్స్తో మేం చదువుకుంటే మా క్లాస్ మేట్స్ కోమట్లు తల్లిదండ్రులు వాళ్ల జీవితాలను వెచ్చించి పిల్లల్ని చదివించుకున్నారని, కాబట్టి, వాళ్లను స్మగ్లర్లుగా చూడడానికి తనకు ఇబ్బందిగా అనిపిస్తోందన్నారు.