పట్టించుకోరా: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సుప్రీం కోర్టు సమన్లు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సుప్రీం కోర్టు బుధవారం నాడు సమన్లు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలు సహా మొత్తం పది రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సుప్రీం ఈ సమన్లు ఇచ్చింది.
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సుప్రీం కోర్టు బుధవారం నాడు సమన్లు జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాలు సహా మొత్తం పది రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు సుప్రీం ఈ సమన్లు ఇచ్చింది.
జాతీయ ఆహార భద్రత చట్టం (ఎన్ఎఫ్ఎస్ఏ) అమలులో విఫలమైనందుకు గాను కరవు బారిన పడిన ఈ పది రాష్ట్రాలలకు సుప్రీం కోర్టు బుధవారం షాకిచ్చింది. చట్టం వచ్చిననాటి నుంచి అవసరమైనంత సమయం గడిచిపోయినా ఆయా రాష్ట్రాలు అమల్లో విఫలమయ్యాయని జస్టిస్ ఎంబి లోకుర్, జస్టిస్ ఎన్వి రమణలతో కూడిన ధర్మాసనం పేర్కొంది.
ఇది పార్లమెంటు చేసిన చట్టానికి ప్రాముఖ్యం ఇవ్వకపోవడమేనని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 (ప్రాణాలకు రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛ)కి కూడా సంబంధం ఉందని స్పష్టం చేసింది. ఎన్ఎఫ్ఎస్ఏ సెక్షన్ 16 కింద తప్పనిసరిగా ఏర్పాటు చేయాల్సిన రాష్ట్ర ఆహార కమిషన్ల నియామకం జరగలేదని పేర్కొంది.
వాటిని ఏర్పాటు చేసి, సభ్యుల నియామకం సహా అన్ని వివరాలను సమర్పించాలని ఆయా రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులను ఆదేశించింది. ఎన్ఎఫ్ఎస్ఏ సెక్షన్ 15 కింద జిల్లా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థల ఏర్పాటుకు సంబంధించి ఒక స్వతంత్ర సభ్యుడి నియామకం సహా ఇతర నిబంధనలను రూపొందించాలని చెప్పింది.
అలాగే సామాజిక తనిఖీలు నిర్వహించిందీ లేనిదీ తెలపాలని ఆదేశించింది. మధ్యాహ్న భోజన పథకం అమలుపై కూడా వివరాలివ్వాలని పేర్కొంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఝార్ఖండ్, బీహార్, హర్యానా, చత్తీస్గఢ్లకు సమన్లు జారీ చేసింది.
సంబంధిత వివరాలన్నింటినీ కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 26 నాటికి సమర్పించాలని ఆదేశించింది. కరవు పీడిత రాష్ట్రాల్లో రైతులకు వివిధ సహాయక చర్యలను కోరుతూ స్వరాజ్ అభియాన్ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యం విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ఈ ఆదేశాలిచ్చింది.