మల్లన్న సాగర్ నిర్వాసితులను భయపెట్టిస్తున్నారు..! చెల్లింపుల్లో అవినీతి జరుగుతోందన్న కాంగ్రెస్
హైదరాబాద్ : మల్లన్న సాగర్ వ్యవహారంపై ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మళ్లీ నోరు విప్పింది. మల్లన్న సాగర్ పరిసర ప్రాతాంల్లో రైతులెవరూ స్వచ్చందంగా పొలాలను ఇచ్చేందుకు ముందుకు రాలేదని, ప్రభుత్వం బెందిరింపులకు పాల్పడడంతోనే అక్కడున్న అమాయక ప్రజలు ఒప్పుకుంటున్నారని కాంగ్రెస్ పార్ఠీ వర్కింగ్ ప్రసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఘాటుగా విమర్శించారు. మల్లన్న సాగర్ నిర్వాసితులను ప్రభుత్వం భయబ్రాంతులకు గురిచేస్తోందని ఆయన ఆరోపించారు. రైతులకు పరిహారం విషయంలో కోర్టులను టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందన్నారు.
ఇక్కడి పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పొన్నం ప్రభాకర్.. మల్లన్న సాగర్ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పునకు అనుగుణంగా నిర్వాసితులకు పరిహారం చెల్లించిన తర్వాతే పనులు చేయాలని డిమాండ్ చేశారు. భూసేకరణ చట్టాన్ని అమలు చేయాలన్నారు. నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా పోలీసుల పర్యవేక్షణలో ప్రాజెక్టు పనులు చేస్తున్నారని దుయ్యబట్టారు. అంతేకాకుండా పరిహారం పొందేవారిలో తప్పుడు లబ్దిదారుల పేర్లు బయటకు వస్తున్నాయని ఆరోపించారు. నిజనిర్థారణ కమిటీ వేసి జరుగుతున్న పరిణామాలు తెలుసుకోవాలని కోర్టుకు పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు.