కట్టిన స్కూలు ఫీజు రీఫండ్ చేయాల్సిందేనన్న కన్జ్యూమర్ ఫోరం..ఎవరికి వర్తిస్తుంది..?
మీ పిల్లలను ఒక స్కూలులో చేర్పించి ఫీజు కట్టేశారా..? చేర్పించిన తర్వాత స్కూలు గురించి తెలుసుకుని మరో స్కూలుకు మీ పిల్లలను మార్చాలని భావిస్తున్నారా..? అయితే భారీగా కట్టిన ఫీజు తిరిగి వెనక్కు ఇవ్వరని మీ పిల్లలను అదే స్కూల్లో కంటిన్యూ చేస్తున్నారా అయితే మీ కోసమే గుడ్ న్యూస్.
కట్టిన ఫీజు చెల్లించాల్సిందే
తమ పిల్లలను మంచి స్కూల్లో చదివించాలనేది ఏ తల్లిదండ్రులకైనా కోరిక ఉంటుంది. మంచి స్కూల్లో తన బిడ్డలను చేర్పించి ఫీజు ఎంతైనా సరే భరించేందుకు ధైర్యం చేస్తారు తల్లిదండ్రులు. ఫీజు మొత్తం కట్టేసిన తర్వాత ఒకవేళ తమ పిల్లలను ఆ స్కూలు కాకుండా మరో స్కూళ్లో చేర్పించాలని భావిస్తే అప్పటికే ఫీజు కట్టి ఉన్నారు కాబట్టి ఆ ఫీజు వెనక్కు ఇవ్వరు కనుక తమ పిల్లలను గత్యంతరం లేక అదే స్కూల్లో కొనసాగిస్తున్నారు. ఇకపై అలాంటి బాధలు ఉండవు. పిల్లలను మరో స్కూలుకు మార్చాలంటే స్కూలు యాజమాన్యంకు కట్టిన ఫీజును తిరిగి చెల్లించాల్సిందేనంటూ జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. కేవలం ప్రాసెసింగ్ ఫీజు కింద రూ.1000పట్టుకుని మిగతాది చెల్లించాలని ఆదేశాలు జారీ చేసింది.
కట్టిన డబ్బును తిరిగి ఇవ్వాల్సిందిగా కోరిన విద్యార్థి తండ్రి
జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశాలు ఇచ్చిన తర్వాత కరీంనగర్లోని వినియోగదారుల ఫోరంకు కేసు వెళ్లింది. ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం ఓ విద్యార్థి తల్లిదండ్రులు కట్టిన ఫీజును మొత్తం తిరిగి చెల్లించాల్సిందిగా సూచించింది. విద్యార్థి స్కూలులో చేరిన రెండు రోజులకే మరో స్కూలుకు మారాల్సి రావడంతో ఫీజు గురించి తల్లిదండ్రులు యాజమాన్యంను అడిగారు. కట్టిన ఫీజు తిరిగి చెల్లించేది లేదని యాజమాన్యం సమాధానం ఇచ్చింది. 2016, ఏప్రిల్ 18న ఓ విద్యార్థి కరీంనగర్లోని ఓ ప్రైవేట్ స్కూలులో చేరాడు. అడ్మిషన్ ఫీజు కింద రూ.10వేలు కట్టాడు విద్యార్థి తండ్రి. కొన్ని వ్యక్తిగత కారణాలతో తమ బిడ్డ మరో చోటికి వెళ్లాల్సి వస్తోందని చెబుతూ ప్రాసెసింగ్ ఫీజును తీసుకుని మిగతా డబ్బులు తిరిగి ఇవ్వాలని విద్యార్థి తండ్రి స్కూలు యాజమాన్యంను కోరాడు. అయితే ఒక్కసారి కట్టిన ఫీజును తిరిగి రీఫండ్ చేయడం ఉండదని అది స్కూలు నిబంధనల్లో ఉందని యాజమాన్యం వెల్లడించింది.
రీఫండ్ చేయడం కుదరదన్న స్కూలు యాజమాన్యం
ఇదిలా ఉంటే స్కూలు అడ్మిషన్ అప్లికేషన్పై ఒక్కసారి కట్టిన ఫీజు రీఫండ్ చేయడం జరగదని స్పష్టంగా ఉంది. అదే సమయంలో ఒక నెలలోపే విద్యార్థి అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుంటే ఫీజులో 25శాతం మాత్రమే చెల్లించడం జరుగుతుందనే నిబంధన కూడా అప్లికేషన్లో ఉంది. మరోవైపు రిజిస్ట్రేషన్ ఫీజు రీఫండ్ చేయడం జరగదని కాషన్ డిపాజిట్ కింద రాసి ఉందని ఆ ప్రైవేట్ స్కూలు యాజమాన్యం జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ వద్ద వాదనలు వినిపించింది. మొత్తం ఫీజు రూ.40వేలు. అందులో 25 శాతం రూ.10వేలు . ఈ పదివేలల్లో రూ. 6వేలు ఎగ్జామినేషన్ ఫీజు కాగా మరో రూ. 4వేలు కాజన్ డిపాజిట్ అని యాజమాన్యం తెలిపింది.
వడ్డీతో సహా విద్యార్థి ఫీజు చెల్లించాలని ఫోరం ఆదేశం
ఇరు పార్టీల వాదనలు విన్న వినియోగదారుల ఫోరం జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఆదేశాల మేరకు తీర్పు చెప్పింది. విద్యార్థి తండ్రి కట్టిన రూ. 10వేలల్లో రూ.9వేలు తిరిగి చెల్లించడంతో పాటు ఏడాదికి 9శాతం వడ్డీ కూడా చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. అంటే ఫిర్యాదు దాఖలు చేసినపట్టి నుంచి ఇప్పటి వరకు అంటే 29 ఏప్రిల్ 2016 నుంచి 2020 వరకు వడ్డీ చెల్లించాలని స్కూలు యాజమాన్యానికి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా అదనంగా రూ.5వేలు పరిహారం కింద చెల్లించాలని ఆదేశించింది.