గణతంత్ర వేడుకల్లో విషాదం: ఆ గ్రామంలో తొలిసారి జాతీయ జెండా ఎగిరింది
హైదరాబాద్: కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం గంభీపూర్లో గణతంత్ర వేడుకల్లో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. గంభీపూర్లోని పాఠశాలలో స్కూలు హెడ్ మాస్టర్ భద్రం జెండా ఎగురవేస్తూ ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందారు.
పోలీసుల కథనం ప్రకారం రిపబ్లిక్ డే ఉత్సవాల్లో భాగంగా ఈరోజు ఉదయం స్వాతంత్ర్య ఉద్యమ నేతల చిత్రపటాలకు కొబ్బరికాయ కొట్టి జెండాను ఆవిష్కరించబోతున్న క్రమంలో గుండెపోటు రావడంతో ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు.
దీంతో ఆయన్ని ఆటోలో ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడు కేరళ రాష్ట్రానికి చెందిన వ్యక్తి.
ఆ గ్రామంలో జాతీయ జెండా తొలిసారి ఎగిరవేశారు
గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా టాక్లి గ్రామంలో తొలిసారిగా జాతీయ జెండా ఎగిరింది. 67వ గణతంత్ర దినోత్సవం రోజున ఆ గ్రామంలో జాతీయ జెండాను ఎగురవేశారు. బయటి ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేని ఈ గ్రామం దుస్థితిపై ఒక టీవీ ఛానల్ కథనం మేరకు అధికార యంత్రాంగం దృష్టి సారించింది.
దీంతో గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు ఈ గ్రామానికి ఇప్పటి వరకు ప్రభుత్వం పథకాలేవీ అందుబాటులోకి రాకపోవడం గమనార్హం.