వేములవాడలో స్కూల్ వ్యాన్ బోల్తా.. ముగ్గురు విద్యార్థులు బలి.. మద్యం మత్తులో డ్రైవర్..!
సిరిసిల్ల : వేములవాడ శివారులో స్కూల్ వ్యాన్ బోల్తా పలు అనుమానాలకు తావిస్తోంది. ముగ్గురు విద్యార్థులను పొట్టన బెట్టుకున్న ఈ యాక్సిడెంట్ స్కూల్ యజమాన్యం నిర్లక్ష్య ధోరణిని బయటపెట్టింది. బస్సుకు అసలు ఫిట్నెస్ ఉందా అనేది పెద్ద ప్రశ్నలా మారింది. ఇక వ్యాన్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడనే మరో భయంకరమైన నిజం స్థానికులకు ఆగ్రహం తెప్పించింది. ఆ క్రమంలో అతడిపై దాడి చేశారు.
వేములవాడ శివారులో స్కూల్ వ్యాన్ బోల్తా పడి ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన ఘటన చర్చానీయాంశమైంది. తిప్పాపూర్ శివారులో వాగేశ్వరి స్కూల్కు చెందిన స్కూల్ వ్యాన్ బోల్తా పడటంతో స్పాట్లో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా.. మరో విద్యార్థి ఆసుపత్రికి తరలించిన తర్వాత చనిపోయాడు. తీవ్ర గాయాల పాలైన ఐదుగురు విద్యార్థులకు సిరిసిల్ల ఏరియా హాస్పిటల్లో వైద్యం అందిస్తున్నారు.
స్కూల్ వ్యాన్ బోల్తా.. మద్యం మత్తులో డ్రైవర్..!
27 మంది విద్యార్థులతో బయలుదేరిన వాగేశ్వరి స్కూల్ వ్యాన్ తిప్పాపూర్ శివారులోని అయ్యప్ప ఆలయం సమీపంలో బోల్తా పడింది. వట్టెం గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థిని మనస్విని.. మానాల గ్రామానికి చెందిన 2వ తరగతి విద్యార్థిని దీక్షిత అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మానాలకు చెందిన మరో బాలుడు రిషి సిరిసిల్ల ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
వ్యాన్ అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అదలావుంటే వ్యాన్ డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రమాదం జరిగిన తీరుపై స్థానికులు మండిపడ్డారు. వ్యాన్ డ్రైవర్కు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. ఘటనాస్థలాన్ని జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే సందర్శించారు. కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ప్రాజెక్టుల కిరికిరి.. ఇటు వీళ్లు, అటు వాళ్లు.. ప్రభుత్వానికి తలనొప్పి వ్యవహారమేనా?
మంత్రి ఈటల పరామర్శ.. న్యాయం చేస్తామని హామీ
వ్యాన్ బోల్తా పడి ముగ్గురు విద్యార్థులు మృత్యువాత పడిన ఘటనపై స్థానికంగా ఆందోళన వ్యక్తమైంది. మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు. ఆ క్రమంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు చనిపోవడం దురదృష్టకరం అన్నారు. గాయపడ్డవారికి ప్రభుత్వం తరపున వైద్య సేవలు అందిస్తామన్నారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. పాఠశాల యాజమాన్యంపై విచారణ చేయించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
కేటీఆర్ స్పందన.. విద్యార్థుల మృతి పట్ల సంతాపం
వేములవాడ స్కూల్ వ్యాన్ బోల్తా ఘటనపై సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. మంత్రి ఈటలకు ఫోన్ చేసి ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. విద్యార్థుల మృతి పట్ల సంతాపం ప్రకటించారు. గాయపడిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించేలా చూడాలని ఈటలను కోరారు.
కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును అక్కడున్నవారిని అడిగి తెలుసుకున్నారు. ప్రమాదంలో చనిపోయిన విద్యార్థుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. బాధితుల తరపున నిలబడటానికి తాను వచ్చానే తప్ప.. రాజకీయం చేయడానికి కాదంటూ స్పష్టం చేశారు. గాయపడిన విద్యార్థులు కూడా పేద కుటుంబానికి చెందినవారని.. వారి వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వం భరించాలని సూచించారు. జిల్లా వైసీపీ అధ్యక్షుడు చొక్కాల రాము ఘటనాస్థలిని పరిశీలించి మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.