తెలంగాణలో స్కూళ్లు ఓపెన్..? ఈ నెల 15వ తేదీ నుంచే, కానీ..
కరోనా వైరస్ వల్ల మూతపడ్డ స్కూల్స్ తెరచుకునే అవకాశం కనిపిస్తోంది. మరో రెండు మూడు రోజుల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి కూడా రానుంది. ఈ క్రమంలో స్కూల్స్ తెరవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. పాఠశాలలు ఓపెన్ చేయాలని విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఈ అంశంపై కేసీఆర్తో కూడా పలు దఫాలుగా మాట్లాడింది. ఆయన కూడా ఓపెన్ చేయడానికే అంగీకరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
గత సంవత్సరం కూడా పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ పాస్ చేయించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది కూడా ఆన్ లైన్ తరగతులు మాత్రమే చెప్పేందుకు అనుమతి ఇస్తున్నారు. కానీ పూర్తిగా జీరో ఇయర్ చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా లేదు. అందుకే ఆన్ లైన్ క్లాసులను ప్రైవేట్ స్కూళ్లతోపాటు.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కూడా చెప్పిస్తోంది. మరోవైపు రోజురోజుకు కరోనా వైరస్ కేసులు తగ్గడం.. ఇమ్యూనిటీ పెరడంతో స్కూళ్లు తెరవాలనే అభిప్రాయం వస్తోంది. దీనికితోడు వ్యాక్సిన్ కూడా వచ్చేస్తుండం కలిసొచ్చే అంశంగా మారింది.
విద్యాసంస్థలు తెరిచేందుకు గల దస్త్రాన్ని విద్యాశాఖ సిద్దం చేసింది. దానిని సీఎం కేసీఆర్ వద్దకు పంపించారు. దానిపై కేసీఆర్ సంతకం చేస్తే స్కూళ్లు తెరవడమే తరువాయి అవుతోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిన విషయం ప్రకారం.. ఈ నెల 15వ తేదీ నుంచి అన్నీ పాఠశాలలు తెరచుకునే అవకాశం కనిపిస్తోంది. కేసీఆర్ వద్ద ఉన్న ఫైలుపై సంతకం చేస్తే చాలు.. స్కూల్స్ తెరిచే విషయంపై స్పష్టత వస్తోంది.
కానీ ఇప్పటికీ కొందరు స్కూల్స్ తెరిచేందుకు సుముఖంగా లేరు. పిల్లల్లో ఇమ్యూనిటీ సరిగా ఉండదని.. అలాంటప్పుడు పంపించి మరీ లేని రోగం తెచ్చుకోవడం ఏంటీ అనే అభిప్రాయం కూడా కొందరు వ్యక్తం చేస్తున్నారు.