వచ్చే నెల నుంచి తెలంగాణలో స్కూల్స్ ఓపెన్: కీలక మార్గదర్శకాలు
హైదరాబాద్: తెలంగాణలో త్వరలోనే పాఠశాలలు తెరుచుకునేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జులై 1 నుంచి ఉన్నత పాఠశాలలను, ఆగస్టు 1 నుంచి ప్రాథమిక పాఠశాలలను తెరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది.
తెలంగాణ విద్యాశాఖ 2020-21 విద్యా సంవత్సరానికి మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. ఒక తరగతి గదిలో 15 మంది విద్యార్థులకు మించి ఉండకూడదని ఆదేశాలు జారీ చేసింది. పాఠశాల గ్రౌండ్, తరగతి గదుల్లో కూడా తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
అంతేగాక, మాస్కులు, శానిటైజర్స్ వాడకాన్ని విద్యార్థులకు అలవాటు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఇక 2020-21 విద్యా సంవత్సరంలో పదో తరగతి పరీక్షలను ఏడు పేపర్లకే పరిమితం చేసింది. ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్షను మాత్రమే నిర్వహించాలని నిర్ణయించింది.
కాగా, విద్యాశాఖ మార్గదర్శకాల నేపథ్యంలో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండే ప్రైవేటు, కార్పొరేట్ స్కూళ్లలో షిఫ్టుల పద్ధతిలో క్లాసులు నిర్వహించడం జరుగుతుందని తెలుస్తోంది. ప్రాథమిక పాఠశాలల్లో ఆదివారం, సోమవారం సెలవు ఉంటుంది.
రెండో శనివారం మాత్రం సెలవు ఉండదు. ప్రైమరీ సెక్షన్ సిలబస్ను 70 శాతానికి కుదించారు. 8 నుంచి 10వ తరగతి వరకు ప్రతీరోజూ క్లాసులు ఉంటాయి. అయితే, స్కూళ్లలో ఎలాంటి ఆటలకు ప్రస్తుతం అనుమతి లేదు.
తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో సోమవారం కొత్తగా 94 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2792కి చేరింది. సోమవారం మరో ఆరుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 82కి చేరింది. కాగా, ఈరోజు నమోదైన కేసులన్నీ తెలంగాణ పరిధిలోనివే కావడం గమనార్హం.
తాజా కేసులతో తెలంగాణలో మొత్తం లోకల్ కేసుల సంఖ్య 2358కి చేరినట్లై వైద్య ఆరోగ్య శాఖ సోమవారం విడుదల చేసిన హెల్త్ బులెటిన్లో వెల్లడించింది. వలస కార్మికులు, విదేశీయులతో కలుపుకుని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 2792కు చేరిందని తెలిపింది. కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం 1213 యాక్టివ్ కేసులు ఉన్నట్లు వైద్యారోగ్యశాఖ తెలిపింది.కరోనా నుంచి కోలుకుని ఇప్పటి వరకు 1491 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు.