బడిబాట: తెలంగాణలో ఏర్పాట్లు పూర్తి.. సమస్యల సుడిగుండంలో ఏపీ
రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం నుంచి పాఠశాలల పున: ప్రారంభానికి రంగం సిద్ధమైంది. విద్యార్థులు దాదాపు రెండు నెలల వేసవి సెలవులకు టాటా చెప్పేసి.. భుజాన పుస్తకాల సంచీ..
హైదరాబాద్/ అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో సోమవారం నుంచి పాఠశాలల పున: ప్రారంభానికి రంగం సిద్ధమైంది. విద్యార్థులు దాదాపు రెండు నెలల వేసవి సెలవులకు టాటా చెప్పేసి.. భుజాన పుస్తకాల సంచీ.. చేతిలో టిఫిన్ డబ్బాతో వారంతా బడిబాట పట్టనున్నారు. తెలంగాణలో 2017-18 లో గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ స్కూళ్లలో సౌకర్యాలు, మౌలిక సదుపాయాల కల్పన పరంగా విద్యాశాఖ ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తిచేసింది. ఇప్పటికే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను పంపిణీ చేసింది. నూరుశాతం పాఠ్యపుస్తకాల పంపిణీ జరిగినట్లు అధికారులు చెబుతున్నప్పటికీ.. 80 నుంచి 85శాతం వరకు విద్యార్థులకు చేరాయి. అలాగే యూనిఫారాల క్లాత్ కూడా ఇప్పటికే స్కూల్ పాయింట్లకు చేర్చింది. వాటిని విద్యార్థులు కుట్టించుకోవడమే మిగిలింది. విద్యార్థుల కొలతల ఆధారంగా వారం రోజుల్లో వారికి సరఫరా చేసేందుకు క్షేత్రస్థాయిలో ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో స్వాగతం పలుకుతున్న సమస్యలు
ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో కలిపి దాదాపు 61,529 స్కూళ్లు ఉండగా 68.56 లక్షల మంది విద్యార్థులు కొత్త తరగతుల్లో అడుగుపెట్టబోతున్నారు. కానీ పాఠశాలల్లో సమస్యలు మాత్రం షరా మామూలుగానే దర్శనం ఇవ్వనున్నాయి. రాష్ట్రంలో మొత్తం విద్యార్థుల్లో 58 శాతం ప్రభుత్వ రంగ పాఠశాలల్లో, 42 శాతం విద్యార్థులు ప్రైవేట్ రంగంలోని పాఠశాలల్లో చదువుతున్నట్లు అంచనా.
ఏపీలో సగం మందికే పాఠ్య పుస్తకాల పంపిణీ
ఒకటి నుంచి పదో తరగతి వరకు పిల్లల కోసం దాదాపు 2.6 కోట్ల పాఠ్యపుస్తకాలు అవసరం కాగా 12వ తేదీ నాటికి అందులో సగభాగమే విద్యార్థులకు అందే అవకాశం కనిపిస్తోంది. మరోవైపు కొన్నేళ్లుగా పాఠశాలల్లో కంప్యూటర్ విద్య మూలనపడింది. కొత్త విద్యా సంవత్సరంలోనూ అదే పరిస్థితి పునరావృతం కానుంది. పాఠశాలల్లో ల్యాబ్లు, లైబ్రరీలు వంటి వసతుల కల్పన పరిస్థితి ఎండమావిగానే ఉందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అదనపు తరగతి గదుల నిర్మాణంలోనూ పురోగతి లేదు.విద్యార్థుల డ్రాపవుట్స్ను తగ్గించే చర్యల్లో భాగంగా ఈ ఏడాది పదో తరగతిలోకి అడుగిడుతోన్న బాలికలకు 1.74 లక్షల సైకిళ్లు పంపిణీ చేయాలని లక్ష్యం పెట్టుకున్నా వేసవి సెలవుల్లో పూర్తి స్థాయిలో అందలేదని సమాచారం.
పదివేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీ
ప్రభుత్వ రంగ పాఠశాలల్లో దాదాపు1.88 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తుండగా దాదాపు 10 వేల వరకు ఖాళీలు ఉన్నాయి. పాఠశాలలు, ఉపాధ్యాయ పోస్టుల రేషనలైజేషన్ ప్రక్రియ వేసవిలో పూర్తి చేస్తామన్న ప్రభుత్వ ప్రకటనలు ఆచరణలో అమలుకు నోచుకోలేదు. ఉపాధ్యాయ సంఘాలు, ఎమ్మెల్సీలు పలు సార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా, అధికారులతో చర్చలు జరిపినా ఎక్కడి గొంగళి అక్కడే అన్న చందంగా పరిస్థితి తయారైంది. అన్ని వైపుల నుంచి ఒత్తిడి రావడంతో రేషనలైజేషన్ కోసం జారీచేసిన ఉత్తర్వులు వివాదాస్పదం అయ్యాయి. ఫలితంగా ఈ నెల 9 నాటికి రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉన్నా ఆచరణ సాధ్యం కాలేదు. రేషనలైజేషన్ పూర్తి కాక టీచర్ పోస్టులు ఎక్కడ ఎన్ని ఖాళీగా ఉన్నాయో స్పష్టత రాలేదు. దీంతో ఉపాధ్యాయ బదిలీల షెడ్యూల్ కూడా నిలిచిపోయింది.
ఉపాధ్యాయుల బదిలీలకు వాస్తవానికి ఈ నెల 9 నుంచి దరఖాస్తులు స్వీకరించాల్సి ఉన్నాశనివారం నాటికి కూడా రాష్ట్రంలోని ఏ జిల్లాలోనూ ఆ ప్రక్రియ మొదలు కాలేదు. సరైన కార్యాచరణ ప్రణాళిక లేకపోవడంతో విద్యాశాఖలో అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. మున్సిపల్ స్కూళ్లలో తెలుగు, ఇంగ్లీషు మాధ్యమాలు రెండూ ఉంటాయని ప్రభుత్వం ప్రకటించినా కేవలం ఇంగ్లీషు మీడియం పుస్తకాలనే పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. పిల్లలకు యూనిఫాం ఎప్పటికి సరఫరా చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా రాష్ట్రంలోని 346 హాస్టళ్లను మూసేసిన ప్రభుత్వం, వాటిల్లోని పిల్లలను కొత్త గురుకులాల్లో చేర్పిస్తామని చెప్పినా ఆ ప్రక్రియ ఇంకా మొదలు కాలేదు. ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులను పక్కాగా నిర్వహించలేదన్న విమర్శలు ఉన్నాయి.
లక్ష్యాలు చేరని పాఠ్య పుస్తకాల ముద్రణ
పాఠశాలలు తెరుచుకునే నాటికి విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందుబాటులో ఉంచాలని సర్కార్ లక్ష్యంగా పెట్టుకున్నా పూర్తిస్థాయిలో నెరవేరేలా కనిపించడం లేదు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు 1,84,19,427 ఉచిత పాఠ్యపుస్తకాలను అందించాలి. 1,63,40,319 పుస్తకాల ముద్రణ మాత్రమే పూర్తయింది. ఇక ప్రైవేట్ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు అమ్మకపు పాఠ్యపుస్తకాలను ముద్రణ విషయం అసాధారణ జాప్యం అమలవుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ స్కూళ్ల విద్యార్థులకు దాదాపు కోటి పాఠ్యపుస్తకాలు అవసరం. దీనికో టెండర్ నోటిఫికేషన్ జారీచేయగా 15 మంది పబ్లిషర్లు టెండర్లలో పాల్గొన్నారు. టెండర్లను ఓపెన్ చేసినా.. ఏ పబ్లిషర్ను ఎంపిక చేసి ఆర్డర్ ఇవ్వాలన్నది మాత్రం ఇప్పటికీ ఖరారు చేయలేదు.
తెలంగాణలో ముందే స్కూళ్ల నిర్వహణ గ్రాంట్ విడుదల
అదే విధంగా ఈసారి స్కూళ్ల పునఃప్రారంభానికి వారం ముందుగానే స్కూళ్ల నిర్వహణ గ్రాంట్ను విద్యాశాఖ స్కూల్ అకౌంట్లలో జమచేసింది. ఒక్కో స్కూల్కు గరిష్ఠంగా రూ.7 వేలు, కనిష్ఠంగా రూ.5వేల చొప్పున నిధులను విడుదల చేసింది. అలాగే పాఠశాల నిర్వహణలో భాగంగా పాఠశాల ఆవరణను శుభ్రంగా ఉంచేందుకు, టాయిలెట్ల నిర్వహణ కోసం నియమించిన స్కావెంజర్లకు 4 నెలల వేతనాన్ని ముందుగానే విడుదల చేసింది. మిగతా నెలల వేతనాలను దసరా తర్వాత మంజూరు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది. మూత్రశాలల్లో రన్నింగ్ వాటర్, డోర్ల ఏర్పాట్లు, టాయిల్స్ ఏర్పాటు కోసం అవసరం ఉన్న పాఠశాలలకు నిధులను మంజూరు చేశారు.
విద్యా వలంటీర్ల నియామకంలోనూ తెలంగాణ ముందే
ఇక ఈసారి విద్యార్థుల సిలబస్కు అంతరాయం కలగకుండా ఉండేందుకు.. ముందుగా విద్యా వాలంటీర్ల నియామకాల ప్రక్రియను చేపట్టింది. రాష్ట్ర ప్రభుత్వం 11వేల మందికి పైగా విద్యా వాలంటీర్ల నియామకానికి అనుమతి ఇవ్వగా.. 10,887 పోస్టుల భర్తీకి పాఠశాల విద్యా కమిషనర్ షెడ్యూల్ జారీ చేశారు. ఈ మేరకు స్కూళ్ల పునఃప్రారంభమయ్యేలోగా నియామకాలను పూర్తిచేయాలని నిర్ణయించారు. కొన్నిచోట్ల రోస్టర్ పాయింట్లకు సంబంధించిన అభ్యర్థులు తక్కువగా ఉండటం.. కొత్తగా 31 జిల్లాలకు రోస్టర్ పాయింట్లు మారిన నేపథ్యంలో కొన్ని చోట్ల విద్యావాలంటీర్ల నియామకానికి ఒకట్రెండ్రోజులు అదనంగా పట్టే అవకాశం ఉంది.
డిజిటల్ పాఠాల బోధన ఇలా
అలాగే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 5,400 హైస్కూళ్లలోని 3,352 స్కూళ్లలో 2016 నవంబర్లో ‘మనటీవీ' ద్వారా డిజిటల్ పాఠాల ద్వారా బోధనను ప్రారంభించారు. ఈ మేరకు ఆర్వోటీలు, కేబుల్ కనెక్షన్ల ద్వారా పాఠాలను బోధిస్తున్నారు. కాగా డిజిటల్ బోధనలో భాగంగా మరో 1,250 స్కూళ్లలో కేయాన్స ఏర్పాటు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు టెండర్ల ప్రక్రియను విద్యాశాఖ పూర్తి చేసింది. ఈ నెల20వ తేదీలోగా వీటిని స్కూళ్లలో ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.