సూర్యాపేటలో విషాదం: నాగార్జునసాగర్ కుడికాలువలోకి దూసుకెళ్లిన కారు..ఆరుగురు గల్లంతు
స్యూర్యాపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలంలోని చాకిరాల గ్రామం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం అదుపుతప్పి నాగార్జున సాగర్ కుడి కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఆరుగురు హైదరాబాద్ వాసులు గల్లంతయ్యారని సమాచారం. గల్లంతయిన వారంతా వారి సహోద్యోగి వివాహానికి హాజరై వస్తుండగా ప్రమాదం జరిగింది. గల్లంతైన వారిని సికింద్రాబాద్ కు చెందిన అబ్దుల్ , రాజేష్, జాన్సన్ , సంతోష్ కుమార్ ,నరేష్ ,పవన్ కుమార్లుగా గుర్తించారు.
ప్రమాదం రాత్రి సమయంలో జరగడంతో సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. సాగర్ కాలువ ఉదృతంగా ప్రవహిస్తుండడంతో రక్షణ సహాయక చర్యలకు ఆటంకంగా మారింది. కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయకచర్యలను పర్యవేక్షిస్తున్నారు. గల్లంతయిన ఆరుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో వీరు ఆ ప్రవాహానికి కొట్టుకుపోయి ఉంటారా అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
గల్లంతయిన వారంతా ఈసీఐఎల్లోని అంకుర హాస్పిటల్లో పనిచేస్తున్నారు. అంబులెన్స్ డ్రైవర్ విమలకొండ మహేష్ కుమార్ వివాహానికి హాజరై వస్తుండగా వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపుతప్పడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వాహనం వెనకే మరో ఇన్నోవా వాహనంలో అదే ఆస్పత్రిలో పనిచేస్తున్న వారు ఉన్నారు. వీరంతా చూస్తుండగానే స్కార్పియో వాహనం నీళ్లల్లో మునిగిందని చెప్పారు. వెంటనే హాస్పిటల్కు సమాచారం అందించారు.
ప్రమాదం గురించి తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన అంకుర ఆస్పత్రికి చేరుకున్నారు. వారి రోదనలతో ఆస్పత్రి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. అనంతరం వారంతా హుటాహుటిన సంఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లినట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇదిలా ఉంటే గల్లంతయిన వారికోసం సహాయక చర్యలను ముమ్మరం చేశారు పోలీసులు. నీటి ఉధృత ఎక్కువగా ఉండటంతో వీరి పనులకు కాస్త ఆటంకం కలుగుతోంది.