సూపర్ ‘సౌత్ సెంట్రల్ రైల్వే’: సోషల్ మీడియాలో కూతురు ఏడ్చిన ఫొటో.. ఆమె ట్యాబ్ తిరిగొచ్చింది
హైదరాబాద్: ఓ అమ్మాయి తన టాబ్లెట్(ట్యాబ్)ను రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో పోగొట్టుకుంది. ఆ తర్వాత ఆ విషయం గుర్తించిన ఆ చిన్నారి చిన్నబోయింది. తనకు తన ట్యాబ్ కావాలంటూ ఏడుస్తూ కూర్చుంది. దీంతో ఆ అమ్మాయి తండ్రి ఆమె ఫొటోను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఆ ఫొటోనే ఆమె ట్యాబ్ను ఆమెకు తిరిగివచ్చేలా చేసింది.
ట్యాబ్ పోగొట్టుకున్న చిన్నారి..
ఆ వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరానికి చెందిన ముస్తఫా సాదిఖ్ అనే వ్యక్తి సోమవారం తన కుమార్తె ఏడుస్తున్న ఫొటోను సోషల్ మీడియా(ట్విట్టర్)లో పోస్టు చేశారు. విశాఖపట్నం నుంచి దురంతో ఎక్స్ప్రెస్లో తన కూతురు హైదరాబాద్ నగరానికి వచ్చిందని.. బీ-11 కోచ్, సైడ్ అప్పర్ బెర్త్లో ఆమె ప్రయాణించిందని వ్యాఖ్యానించారు. అక్కడే ఆమె తన ట్యాబ్ను పోగొట్టుకుందని పేర్కొన్నారు.
ఏడుస్తూ కూర్చున్న అమ్మాయి..
ఆ తర్వాత ఇంటికి వచ్చి చూసుకుని ఏడుస్తూ కూర్చుందని తన పోస్టుతోపాటు ఈ వ్యాఖ్యలు జోడించారు ముస్తఫా. ఈ విషయంలో తనకు సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తూ... సౌత్ సెంట్రల్ రైల్వేను ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్పై రైల్వే అధికారులు వెంటనే స్పందించారు.
వెంటనే స్పందించిన రైల్వే అధికారులు..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చేరుకున్న దురంతో ఎక్స్ప్రెస్లో ట్యాబ్ దొరుకుతుందేమోనని అధికారులు, సిబ్బంది సాయంతో వెతికించారు. నిజానికి విద్యాసాగర్ అనే రైల్వే కాంట్రాక్ట్ ఉద్యోగికి ఆ ట్యాబ్ దొరికింది. దానిని ఆయన అధికారులకు అప్పగించారు.
చిన్నారి ముఖంలో ఆనందం నింపిన రైల్వే అధికారులు..
ఈ విషయాన్ని అధికారులు ముస్తఫాకు తెలియజేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ మేనేజర్ను కలిసి ఆ ట్యాబ్ తీసుకోవాలని ట్వీట్ చేశారు. దీంతో తన ట్యాబ్ మళ్లీ తన దగ్గరికి వస్తుందని తెలిసి ఆ అమ్మాయి ముఖంలో ఆనందం వెల్లివిరిసింది. ఏడుస్తున్న ఆమె ముఖంలో నవ్వులు విరిశాయి. ఆ ట్యాబ్ను తిరిగి తన కూతురుకు ఇచ్చే పనిలో ఉన్నాడు తండ్రి ముస్తఫా. మొత్తానికి రైల్వే అధికారులు సకాలంలో స్పందించడంతో ఆ అమ్మాయి ముఖంలో ఆనందం చూశాడు ఆ తండ్రి. నెటిజన్లు కూడా రైల్వే అధికారులకు అభినందిస్తూ ట్వీట్లు చేస్తున్నారు.