వ్యక్తిగత దూషణలు... తోపులాట... బయటపడ్డ టీఆర్ఎస్ నేతల మధ్య విభేదాలు...
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య శనివారం(అక్టోబర్ 31) తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రోటోకాల్ విషయంలో తలెత్తిన వివాదం... ఒకరిపై ఒకరు అసభ్య పదజాలంతో దూషించుకుంటూ ఘర్షణకు దిగే దాకా వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
శనివారం సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో ఆయన చిత్రపటాన్ని ఏర్పాటు చేసి స్థానిక నాయకులు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఛైర్మన్,మున్సిపల్ వైస్ ఛైర్మన్ల మధ్య వాగ్వాదం తలెత్తింది. ప్రోటోకాల్ పాటించడం లేదంటూ వైఎస్ ఛైర్మన్ ఆగ్రహం వ్యక్తం చేయగా... ఇరు వర్గాలు ఒకరినొకరు దూషించుకున్నారు. ఈ క్రమంలో తోపులాట చోటు చేసుకోగా... కొందరు నేతలు ఇరువురిని ఆపే ప్రయత్నం చేశారు. ఇలా ఒకే పార్టీకి చెందిన నేతల మధ్య విబేధాలు బయటపడటం స్థానికంగా హాట్ టాపిక్గా మారింది.
మున్సిపల్ ఛైర్మన్ రామ తీర్థపు మాధవి భర్త రాజుకు,మున్సిపల్ వైస్ ఛైర్మన్ రాజేందర్కు మధ్య కొంతకాలంగా విభేదాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ఇరువురు పలు అంశాల్లో తీవ్రంగా విభేదించుకోగా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే ఎమ్మెల్యే దీనిపై అంతగా ఫోకస్ చేయకపోవడంతో... ఇరువురి మధ్య గొడవలు అంతకంతకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లా జిల్లాలోనే ఈ ఘటన చోటు చేసుకోవడంతో... ఆయన ఎలా రియాక్ట్ అవుతారోనన్న చర్చ కూడా జరుగుతోంది.