నయీమ్ బెడ్రూంలో రహస్యాలు: గోవాలో జల్సాలు, కేర్ టేకర్ అరెస్టు
హైదరాబాద్: నాగిరెడ్డి నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు నార్సింగిలోని నయీమ్ ఇంటి బెడ్రూంలో బుధవారం సోదాలు నిర్వహించారు. ఇందులో మరిన్ని రహస్యాలు వెలుగు నయీమ్ బెడ్రూం, పర్సనల్ రూంలో తనిఖీలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా సిట్ అధికారులు పలు పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
నయీం ఇంట్లోంచి భారీగా నగదును, రెండు బ్యాగుల డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్టన్లు తెలుస్తోంది. నయీం నివాసంలో తనిఖీలు పూర్తి కావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉంది. రాజేంద్రనగర్ మండలం నెక్నాంపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని అల్కాపురి టౌన్షిప్లోని నయీం ఇంట్లో 60కి పైగా ఖరీదైన గడియారాలు, డైమండ్ రింగ్స్, ఎకె 47 గన్ లభించినట్లు తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా నయీం కుటుంబ సభ్యులను, అనుచరులను కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. హైదరాబాదులోని వనస్థలిపురం ద్వారకామయి నగర్లో నయీం అనుచరుడు ఖయ్మూమ్ ఇఁటిని బుధవారం పోలీసులు గుర్తించారు. ఆ ఇంట్లో మరో ఇద్దరు అనుచరులు ఉంటున్నట్లు సమాచారం. ఆ ఇద్దరు నరేష్, సుధాకర్ నయీం ఎన్కౌంటర్ తర్వాత పారిపోయినట్లు తెలుస్తోంది.
చత్తీస్గఢ్, ఒడిశా, గోవాల్లో నయీం ఆస్తులను కూడబెట్టినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ పోలీసు అధికారులతో పాటు ఛత్తీస్గడ్, ఒడిశా రాష్ట్రాల అధికారులతో సంబంధాలున్నట్లు తెలుస్తోంది. మావోయిస్టులను పట్టిస్తానని పోలీసు అధికారులను నయీమ్ బుట్టలో వేసుకున్నట్లు తెలుస్తోంది. నయీంకు ఛత్తీస్గడ్ పోలీసులు ఎకె 47ను సమకూర్చినట్లు సమాచారం.
నయీం 35 పేజీల డైరీలో పోలీసు అధికారులు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు తదితరుల పేర్లు కోడ్ భాషలో ఉన్నట్లు తెలుస్తోంది. అధికారులు ఆ కోడ్ భాషను డీకోడ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. డైరీలో 9 మంది ఎసిపి స్థాయి అధికారుల పేర్లు, 20 మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఐపిఎ్ అధికారుల పేర్లు ఉన్నట్లు తెలుస్తోంది.
గోవా బీచ్లోని ఓ విలాసవంతమైన ఇంట్లో నయీమ్ జల్సాలు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆ ఇంటి కేర్ టేకర్ మహ్మద్ తాజుద్దిన్ను పోలీసులు అరెస్టు చశారు. అతన్ని రేపు గురువారం కోర్టులో ప్రవేశపెడుతామని సైబరాబాద్ వెస్ట్ సీపి నవీన్ చంద్ చెప్పారు. తాజుద్దీన్ నుంచి దాదాపు 4 లక్షల రూపాయల నగదును, బొలేరో వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కాగా, నయీమ్ ఓ టీవీ చానెల్ ప్రారంభించడానికి కూడా పూనుకున్నట్లు తెలుస్తోంది. ఇందుకు గాను నల్లగొండకు చెందిన ఓ విలేకరికి 3 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు చెబుతున్నారు.