కొలిక్కిరాని సీట్ల సర్ధుబాటు..! కూటమిలో ఉత్కంఠ..! రేపు సీట్లను ప్రకటించనున్న కోదండరాం..!
హైదరాబాద్ : తెలంగాణ మమాకూటమి పరిస్థితి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఎప్పుడు ఏ నాయకుడు ఏ హోటల్ లో ఎవరితో మంతనాలు జరుపుతారో తెలియని పరిస్థితులు తలెత్తాయి. డెయిలీ సీరియల్ తలపించేలా జరుపుతున్న చర్చలు కూడ కొలిక్కి రాకపోవడంతో జనసమితి, సీపీఐ నేతలు అయోమయానికి లోనౌతున్నట్టు తెలుస్తోంది. ఆదివారం నాడు చివరగా భేటీ నిర్వహంచి తాడో పేడో తేల్చకునే దిశగా ఈ రెండు పార్టీలు సమాలోచనలు చేస్తున్నాయి. కూటమిలో నాన్చుడు ధోరణి పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నాయి ఈ రెండు పార్టీలు.
కొలిక్కి రాని మహాకూటమి మంతనాలు..! తాడోపేడో దిశగా కోదండరాం, చాడా..!!
తెలంగాణ రాష్ట్ర సమితిని మరోసారి అధికారం దక్కించుకోకుండా చేసేందుకు నాలుగు పార్టీలు కలిసి మహాకూటమిగా ఏర్పడిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు రావడంతో రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీని ఓడించేందుకు కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజెఎస్ పార్టీలు ఏకతాటిపై మహా కూటమి పేరిట ఒక్కటయ్యాయి. దీంతో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో మహా కూటమి పార్టీల నుంచి ఎవరో ఒక పార్టీ నుంచి అభ్యర్థిని ఎంచుకుని మిగతా పార్టీల నాయకులు, ఏకతాటిపై మహా కూటమి అభ్యర్థిని గెలిపించేందుకు కృషిచేయాలని తీర్మానించాయి. ఈ కూటమి ఏర్పాటై రెండు నెలలు గడుస్తున్నా.. సీట్ల సర్ధుబాటు మాత్రం కొలిక్కిరావడంలేదు.
మిత్ర పక్షాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ..! ఎటూ తేల్చని కాంగ్రెస్..!!
కాంగ్రెస్ ఎన్ని స్థానాలను తీసుకుంటుందో, మిత్ర పక్షాలకు ఎన్ని స్థానాలను కేటాయిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది. శాసనసభ ఎన్నికల బరిలో నిలిచే కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితాలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. 74 సీట్లకు అభ్యర్థులు ఖరారయ్యారని, తొలి జాబితాను శనివారం ప్రకటిస్తామని ఆ పార్టీ ముఖ్యనేతలు వెల్లడించారు. అయితే, కొంత గందరగోళం తలెత్తిన నేపథ్యంలో అభ్యర్థుల ప్రకటనను వాయిదా వేసింది కాంగ్రెస్ అదిష్టానం.
వార్ రూమ్ చర్చలు అనుకూలించకపోతే యుద్దమే..! హెచ్చరిస్తున్న మిత్రపక్షాలు..!!
ఇలాంటి పరిస్థితుల్లో మహాకూటమిలో భాగంగా కొన్ని సీట్లు వేరే పార్టీలకు దక్కుతున్నాయన్న అనుమానంతో ఆయా నియోజకవర్గాల్లోని కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన బాటపడుతున్నారు. తమ నాయకుడికే సీటు కేటాయించాలంటూ ధర్నాలు చేస్తున్నారు. టికెట్ కోసం ఆశావహులు ఢిల్లీలో మకాం వేస్తే.. వారి అనుచరులు గాంధీభవన్లో నిరసనలకు దిగుతున్నారు. ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం అభ్యర్థుల ప్రకటనను ఆలస్యం చేస్తోందని తెలుస్తోంది. ఆయా స్థానాలను కాంగ్రెస్ కూడా గట్టిగా కోరుకుంటోన్న నేపథ్యంలో ఏ నియోజకవర్గం ఎవరికి దక్కుతుందన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
తెగేంతవరకూ ఎందుకు లాగాలి..? ఒత్తిడి తేవాలంటున్న మిత్రపక్షాలు..!!
టీఆర్ఎస్ 105 మంది అభ్యర్థులను ప్రకటించడంతో ఏర్పడిన అసంతృప్తి నేటీకి చల్లారకపోవడంతోనే కాంగ్రెస్ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే రెండు, మూడు రోజులుగా ఢిల్లీలోని వార్రూమ్ వేదికగా ఆశావహులతో ఏఐసీసీ ప్రతినిధులు సమావేశమవుతున్నారు. వీళ్లను బుజ్జగించిన తర్వాతే జాబితా విడుదల చేయాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అభ్యర్థుల ప్రకటన ఎంత ఆలస్యమైతే అంత నష్టం వాటిల్లే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి కాంగ్రెస్ అధిష్ఠానం ఏం చేస్తుందో, మిత్ర పక్షాలను ఎలా సంత్రుప్తి పరుస్తుందో చూడాలి.