1800 కోట్లు చెల్లించాలంటూ సత్యం రామలింగరాజుకు సెబీ నోటీసులు
హైదరాబాద్: రూ. 1800 కోట్లు చెల్లించాలంటూ సత్యం రామలింగరాజుకి మార్కెట్ రెగ్యులేటరీ నియంత్రణ సంస్ధ సెబీ గురువారం ఆదేశాలు జారీ చేసింది. సత్యం కంపెనీలో నకిలీ అకౌంట్లతో మోసం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. అంతేకాదు, కుటుంబ సభ్యుల పేరుతో నకిలీ అకౌంట్లు తెరిచి ట్రెడింగ్ నిర్వహించారంటూ ఆరోపణలు ఉన్నాయి.
దీంతో సత్యం రామలింగరాజుతో సహా 10 మంది కుటుంబ సభ్యులకు సెబీ నోటీసులు జారీ చేసింది. ఇందుకు గాను నకిలీ అకౌంట్లతో మోసం చేసి, అక్రమంగా సంపాదించినందుకు గాను రూ. 1800 కోట్లు చెల్లించాలంటూ సత్యం రామలింగరాజుని సెబీ ఆదేశించింది. ప్రస్తుతం రామలింగ రాజు బెయిల్పై ఉన్నారు.
గతంలో రామలింగరాజుతో పాటు మరో నలుగురు మీద సెబీ రూ.1,849 కోట్ల రూపాయలను జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఈ మొత్తాన్ని 12శాతం వడ్డీతో కలుపుకుని (అంటే మొత్తం రూ.3,000కోట్లు) 45 రోజుల్లో చెల్లించాలని సెబీ ఆదేశించింది. సెబీ ఆదేశాలను సవాలు చేస్తూ రామలింగరాజు తదితరులు సెక్యూరిటీస్ అప్సిలేట్ ట్రిబ్యునల్(శాట్)ను ఆశ్రయించారు.
ఈ కేసు విచారణను సోమవారం చేపట్టిన శాట్ సెబీ జరిమానాపై స్టే ఇచ్చింది. ఇంత భారీ జరిమానాలకు ఎందుకు ఆదేశాలు ఇచ్చారనే విషయంపై నవంబర్ 7లోగా వివరణ ఇవ్వాలని సెబీని శాట్ ఆదేశించింది. అయితే, స్టాక్ మార్కెట్ల నుంచి రామలింగరాజు తదితరులను 14 సంవత్సరాల పాటు నిషేధిస్తూ సెబీ తీసుకున్న నిర్ణయాన్ని శాట్ సమర్థించింది.
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సత్యం కంప్యూటర్స్ కుంభకోణం విలువ సుమారు 12,320 కోట్ల రూపాయల వరకు ఉందని సెబి అంచనా వేసింది. రాబడులు, చెల్లింపులను చేర్చకుండా కంపెనీ పద్దు పుస్తకాలను ఏమార్చారని ఈ మొత్తం విలువ 12,318 కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నట్లు తన 65 పేజీల ఉత్తర్వుల్లో తెలిపింది.
ఈ తప్పుడు కార్యకలాపాలకు పాల్పడటం ద్వారా రాజు సహా మరో నలుగురు 1,849 కోట్ల రూపాయలు, వడ్డీల రూపంలో మరో 1,200 కోట్ల రూపాయలను ఆయాచితంగా సంపాదించారని అప్పట్లో తెలిపింది.