శిరీష కేసులో మరో కొత్త కోణం: ఒక్కడు కాదు ఇద్దరు, అతనే ఇద్దరినీ కారులో తీసుకెళ్లాడు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి ప్రగతి రిసార్టులో జరిగిన విద్యార్థిని శిరీష హత్య కేసులో మరో ట్విస్ట్. నిందితుడు సాయి ప్రసాద్కు ఓ వ్యక్తి సాయం చేశాడని పోలీసులు గుర్తించారు. శిరీషను అతను ఒక్కడే హత్య చేశాడా లేక ఎవరైనా సహకరించారా అనే కోణంలో పోలీసులు దర్యాఫ్తు జరిపారు.
శిరీష మరొకరికి దక్కకూడదని స్కెచ్ వేసి హత్య: ఇంకెవరైనా సహకరించారా?
ఈ నేపథ్యంలో మరొకరి సహకారం తీసుకున్నట్లుగా వారి విచారణలో తేలింది. ఈ కేసుకు సంబంధించి రెండో నిందితుడిని పోలీసులు సోమవారం నాడు అరెస్టు చేశారు. ఇతనిది కూడా మొదటి నిందితుడు సాయిప్రసాద్కు చెందిన గ్రామమే. రెండో నిందితుడు మొదటి నిందితుడికి సహకరించాడు.
ఇద్దరినీ కారులో తీసుకొచ్చాడు
సాయిప్రసాద్ స్వగ్రామం కొత్తూరు మండలం తిమ్మాపురం. అదే గ్రామానికి చెందిన షేక్ అబ్దుల్ మజీద్ హత్య సమయంలో సాయిప్రసాద్కు సహకరించినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. శిరీషను, ఆమె ప్రియుడు సాయిప్రసాద్ను మజీద్ తన కారులో రిసార్టుకు తీసుకువెళ్లినట్లుగా గుర్తించారు.
వివిధ కోణాల్లో దర్యాఫ్తు
శిరీష హత్య కేసులో సాయిప్రసాద్ ఒక్కడే నిందితుడు అని పోలీసులు భావించారు. కానీ ఒక్కడే హత్య చేయడం కష్టమేనని భావించిన పోలీసులు వివిధ కోణాల్లో దర్యాఫ్తు జరిపారు. మరింత లోతుగా దర్యాఫ్తు చేయడంతో పోలీసులకు అసలు విషయం తెలిసిందే.
హత్య తర్వాత మొదటి ఫోన్ అతనికే
సాయిప్రసాద్ కాల్ డేటాను పోలీసులు పరిశీలించారు. అతనిని విచారించారు. కాల్ డేటాను చూసి, హత్య తర్వాత సాయిప్రసాద్ తొలుత ఫోన్ చేసింది మజీద్కేనని గుర్తించారు. అయితే, పోలీసులకు సమాచారం అందించకుండా మజీద్ అక్కడి నుంచి కారులో పారిపోయినట్లుగా తేలింది. దీంతో పోలీసులు అరెస్టు చేశారు.
శిరీష గొంతు కోసినప్పుడు సాయిప్రసాద్కూ గాయాలు
కాగా, గత గురువారం సాయంత్రం రంగారెడ్డి జిల్లాలోని ప్రగతి రిసార్టులో శిరీష హత్యకు గురైన విషయం తెలిసిందే. ప్లాన్ ప్రకారమే రిసార్టుకు రప్పించి హత్య చేశాడు. శిరీష గొంతు కోసినప్పుడు సాయిప్రసాద్కు కూడా బలమైన గాయమైంది.