ఖమ్మం జిల్లాలో రెండో కరోనా పాజిటివ్ కేసు..మంత్రి ఆదేశాలు..అప్రమత్తమైన అధికారులు
కరోనా వైరస్ కేసులు బాగా పెరగటం తెలుగు రాష్ట్రాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తెలుగురాష్ట్రాలు సైతం లాక్ డౌన్ నిబంధనలను పాటిస్తూ వ్యాప్తిని తగ్గించటానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఢిల్లీలో నిజాముద్దీన్ సభ ఎఫెక్ట్ ఇంకా అక్కడక్కడ కనిపిస్తూనే ఉంది . తెలుగురాష్ట్రాలను ఒక్కసారిగా ఉలికిపాటుకు గురి చేసిన మత ప్రచార సభ ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల్లో కేసులు బాగా పెరగటానికి కారణం అయ్యింది .
ఇక తెలంగాణలో ఇప్పటివరకు 453 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. నిన్నామొన్నటి వరకు ఒక్క కేసు కూడా లేని ఖమ్మం జిల్లాలో మొన్న తొలి కరోనా పాజిటివ్ కేసు నమోదు కాగా నేడు మరో కేసు నమోదు అయ్యింది .
తెలంగాణలో కరోనా చాలా జిల్లాల్లో తన ప్రభావం చూపిస్తున్నా ఖమ్మం జిల్లాలో మాత్రం మొన్నటి వరకు ఒక కేసు కూడా కాలేదు. కానీ తాజాగా ఢిల్లీ లో జరిగిన తబ్లీఘీ జమాత్ ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వ్యక్తితో కలిసి ప్రయాణం చేసిన వ్యక్తి కి ఎలాంటి లక్షణాలు లేకుండానే కరోనా పాజిటివ్ వచ్చింది . ఇక నేడు మరో కేసు నమోదు అయ్యింది .
తొలి కేసు ఖమ్మం రూరల్ పరిధిలోని పెద్ద తండాలో నివాసం ఉంటున్న 45 సంవత్సరాల వ్యక్తి కాగా, రెండో కరోనా పాజిటివ్ కేసు నేడు రావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మహబూబాబాద్ నుంచి నిజాముద్దీన్ సభకు ఢిల్లీకి వెళ్లిన వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అతనితో కలిసి ప్రయాణం చేసిన వారిని క్వారంటైన్కి తరలించి బ్లడ్ శాంపిల్స్ పంపించారు.
రిపోర్టులో క్వారంటైన్ లో ఉన్నవారిలో ఖమ్మంకు చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా ఇక నేడు ఖమ్మం జిల్లాలో నగరంలోని ఖిల్లా ప్రాంతానికి చెందిన మరో వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో రెండో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ఇక ఈ క్రమంలో ఈ ప్రాంతంలో నేడు జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ పర్యటించారు. స్థానికంగా తెరిచి ఉన్న అన్ని దుకాణాలను మూసేయాలని ఆదేశించారు. ఇళ్ల నుంచి బయటకి వచ్చిన వారిని రావొద్దనినో మూవ్ మెంట్ జోన్ గా ప్రకటించారు . ఖిల్లా ప్రాంతంలో ఇంటింటి సర్వే చేయాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశంతో అధికారులు సర్వే ప్రారంభించారు. ఆ ప్రాంతమంతా శానిటైజ్ చేస్తున్నారు.