హైదరాబాద్ దేశ రెండో రాజధాని: కిషన్ రెడ్డి ఏం చెప్పారంటే..?, ‘కేసీఆర్ మొండివైఖరి వీడాలి’
న్యూఢిల్లీ: ఢిల్లీ కాలుష్య తీవ్రత నేపథ్యంలో హైదరాబాద్ను రెండో రాజధాని చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని ఇటీవల మహారాష్ట్ర గవర్నర్, బీజేపీ సీనియర్ నేత విద్యాసాగర్ రావు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్ను దేశ రెండో రాజధాని చేయాలనే డిమాండ్లు గతంలో కూడా వినిపించాయి.
ప్రస్తుతం అలాంటిదేం లేదు..
ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ఈ అంశంపై స్పందించారు. దేశానికి రెండో రాజధానిగా హైదరాబాద్ను ఉంచాలన్న ప్రతిపాదన ఏదీ కేంద్రం వద్ద లేదని ఆయన స్పష్టం చేశారు. ఢిల్లీలో ఆయన ఆదివారం మీడియాతో మాట్లాడారు.
గత సమావేశాల్లో..
సోమవారం నుంచి ప్రారంభంకానున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రతిపక్షాలు లేవనెత్తే అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. గత సమావేశాల్లో ఆర్టికల్ 370 రద్దు, ట్రిపుల్ తలాక్ రద్దు బిల్లులను తీసుకొచ్చామని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి చెప్పారు.
దేశ ప్రజల ముందుకు మా ఎజెండా..
తాజా పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో తమ ఎజెండాను దేశ ప్రజల ముందు ఉంచుతామని కిషన్ రెడ్డి తెలిపారు. విద్య, వైద్యం, నదుల అనుసంధానంపై సమావేశాల్లో చర్చిస్తామని ఆయన తెలిపారు. దేశ వ్యాప్తంగా ప్రతి ఇంటికి నీరు, విద్య, వైద్యం వంటి మౌలిక వసతుల కల్పనే కేంద్ర ప్రభుత్వ తమ ధ్యేయమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.
కేసీఆర్ మొండివైఖరి వీడాలి
తెలంగాణలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపైనా కిషన్ రెడ్డి స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం తన మొండి వైఖరి వీడి కార్మికులతో చర్చలు జరపాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామని బీజేపీ గానీ, కాంగ్రెస్ పార్టీలు గానీ చెప్పలేదని తెలిపారు. విభజన చట్టం ప్రకారమే పోలవరంకు జాతీయ హోదా ఇచ్చామని స్పష్టం చేశారు. కాళేశ్వరానికి జాతీయ హోదా అంశాన్ని విభజన బిల్లులో పెట్టించేలా కేసీఆర్ ఎందుకు డిమాండ్ చేయలేదని ప్రశ్నించారు.