సజావుగా సాగుతున్న రెండోదశ పరిషత్ పోలింగ్
తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు రెండో దశ పోలింగ్ సజావుగా సాగుతోంది. ఈ విడతలో మొత్తం 1,913 ఎంపీటీసీ స్థానాలుండగా... వాటిలో 63 ఏకగ్రీవమయ్యాయి. అవి పోనూ మిగిలిన 1,850 ఎంపీటీసీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ దశలో ఎంపీటీసీ స్థానం కోసం మొత్తం 6,146 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు బ్యాలెట్ బాక్సుల్లో భద్రపరుస్తున్నారు. రెండు స్థానాలు మినహా మిగతా అన్ని సీట్లలో టీఆర్ఎస్ అభ్యర్థుల్ని బరిలో నిలిపింది. కాంగ్రెస్, మిగతా పార్టీలు కొన్ని స్థానాల్లోనే పోటీ చేస్తున్నాయి.
ఇక రెండో దశ పరిషత్ పోరులో 179 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నిక జరగుతుండగా.. 805మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఈ దఫా ఎన్నిక కోసం రాష్ట్ర ఎన్నికల సంఘం 10,371 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసింది. సాయంత్రం ఐదింటి వరకు ఓటింగ్ జరగనుండగా.. 218 స్థానాల్లో మాత్రం నాలిగింటికే పోలింగ్ ముగియనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైనందున గంట ముందుగానే పోలింగ్ ముగించాలని అధికారులు నిర్ణయించారు.