ఎప్పుడూ లక్కీనే : అప్పుడు రెండుసార్లు - ఇప్పుడు రెండుసార్లు.. మంత్రిగా తలసాని ప్రస్థానం
హైదరాబాద్ : హైదరాబాద్ రాజకీయ నేతల్లో ముఖ్యుడిగా ముద్రపడ్డ తలసాని శ్రీనివాస్ యాదవ్ మరోసారి టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా కొలువుదీరారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన తలసానికి కేసీఆర్ కేబినెట్ లో రెండోసారి మంత్రి పదవి దక్కింది. తొలి తెలంగాణ ప్రభుత్వంలో సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక శాఖ మంత్రిగా పనిచేసిన ఈ బీసీ నేతను.. ఈసారి కూడా మంత్రి పదవి వరించింది.
తలసాని.. తరగని ఛరిష్మా
సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజకీయాల్లో ఆరితేరారు. మొదట్లో టీడీపీ పార్టీలో క్రీయాశీలకంగా వ్యవహరించారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ తెలుగుదేశంలోనే కొనసాగారు. అయితే టీఆర్ఎస్ తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొద్దిరోజులకు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దాంతో ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారు సీఎం కేసీఆర్. సినిమాటోగ్రఫీ, పశుసంవర్ధక శాఖల బాధ్యతలు చూసుకున్నారు. కేసీఆర్ ఆదేశాల మేరకు చేప పిల్లలు, గొర్రెల పంపిణీలాంటి బృహత్తర పథకాలను లబ్ధిదారులకు అందించేలా కృషి చేశారు. ఆయన పనితీరుకు నిదర్శనంగానే ఈసారి కూడా మరోసారి మంత్రిపదవి దక్కినట్లైంది.
యాదవ బిడ్డకు మరోసారి పట్టం
హైదరాబాద్ ముఖ్య రాజకీయ నేతల్లో బీసీ యాదవ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్ యాదవ్ ఒకరు. గతంలో సికింద్రాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి ప్రాతినిధ్యం వహించినా.. ఆ తర్వాత కాలంలో సనత్ నగర్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. 2014లో టీడీపీ నుంచి గెలిచిన తలసాని.. రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టీఆర్ఎస్ లోకి మారారు. దాంతో ఆయనకు మంత్రి పదవి కట్టబెట్టారు కేసీఆర్. అదే క్రమంలో ఈసారి కూడా మరోసారి మంత్రి పదవి వరించింది. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వాన టీడీపీ హయాంలో మంత్రిగా కొలువుదీరారు. అప్పుడు పర్యాటక, కార్మిక శాఖ మంత్రిగా పనిచేశారు.
సైకిల్, కారు.. ప్రస్థానం అలా
1965, అక్టోబరు 6న జన్మించిన శ్రీనివాస్ యాదవ్ యుక్తవయసులోనే నేతగా ఎదిగారు. మొదటినుంచి టీడీపీకి వీరవిధేయుడిగా ఉన్న తలసాని.. తెలంగాణ ఉద్యమంలో సైతం పార్టీ మారలేదు. చంద్రబాబుతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా తెలుగుదేశంలో కొనసాగారు. 2014లో సనత్ నగర్ నుంచి ఆ పార్టీ టికెట్ తో పోటీచేసి గెలుపొందారు. అనంతరం కొద్ది కాలానికి గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. మొన్నటి ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ సనత్ నగర్ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. 1994 లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తలసాని వరుసగా విజయాలు సాధిస్తున్నారు. అయితే 2004లో మాత్రం ఓసారి ఓటమి చెందారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.