కూల్చివేతకు సిద్దం చేసిన సెక్రటేరియట్..! ఏ క్షణమైనా భవంతులను తొలగించే అవకాశం...!!
Recommended Video
హైదరాబాద్ : ఉమ్మడి ఏపిలో పాలనా కేంద్రమైన సెక్రటేరియట్ ఇక మనకు కనిపించదు. వాటి స్థానంలో కొత్త భవంతులు రాబోతున్నాయి. సచివాలయంలో ఇప్పటికే ఉన్న బ్లాకులను కూల్చి, వాటి స్థానంలో కొత్తగా సచివాలయ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సెక్రటేరియట్లో ఉన్న శాఖలను విభాగాధిపతుల కార్యాలయాలకు/ కమిషనరేట్లు/డైరెక్టరేట్లకు తరలించనున్నారు. ఈ తరలింపును నెలరోజుల్లోపు పూర్తిచేయనున్నారు. నిజానికి ఆయా శాఖలను ఏపీ సచివాలయంలోని బ్లాకుల్లోకి తరలించి, తెలంగాణ బ్లాకులను కూల్చి అక్కడ కొత్తగా సచివాలయం నిర్మించాలని మొదట అదికారులు భావించారు. కానీ, ఇప్పుడు అలా కాకుండా ఏకకాలంలో సచివాలయంలోని బ్లాకులన్నీ కూలగొట్టి వాటి స్థానంలో కొత్తవి కడితేనే బాగుంటుందని ప్రభుత్వం భావిస్తోంది.
సచివాలంలోని అన్ని బ్లాకులూ కూల్చివేత..! వాటి స్థానంలో కొత్త భవనాలు..!!
ఇందులో భాగంగా పలువురు కీలక అధికారులకు మౌఖిక ఆదేశాలు వెలువడినట్టు సమాచారం. 25.5 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న సచివాలయంలో మొత్తం 10 బ్లాకులున్నాయి. రాష్ట్ర విభజన సమయంలో నాలుగు బ్లాకులు తెలంగాణకు, ఐదు బ్లాకులను ఏపీకి కేటాయించారు. జీ బ్లాకు శిథిలావస్థలో ఉండడంతో దాన్ని ఏ రాష్ట్రానికీ కేటాయించలేదు. ఇటీవలే అన్ని బ్లాకులూ తెలంగాణ అధీనంలోకి వచ్చిన నేపథ్యంలో మొదట తెలంగాణ బ్లాకులు కూల్చి, శాఖలను ఏపీ బ్లాకుల్లోకి తరలించి కొత్తగా నిర్మాణం చేపట్టాలనే యోచన చేశారు.
నెలలో శాఖల తరలింపు పూర్తి..! అధికారులకు ఆదేశాలు..!!
అయితే ప్రణాళిక ప్రకారం నిర్మాణం జరగాలంటే స్థలమంతా ఖాళీగా ఉంటేనే మేలు కలుగుతుందని వాస్తునిపుణులు సూచించడంతో నిర్ణయాన్ని మార్చుకున్నారు. సచివాలయంలోని బ్లాకులన్నీ ఒకేసారి కూల్చి, కొత్త సచివాలయం కట్టడానికి సిద్ధమయ్యారు. తాజా నిర్ణయం ప్రకారం.. మంత్రులకు కూడా విభాగాధిపతుల కార్యాలయంలోని భవనాల్లోనే ఆఫీసులను కేటాయించనున్నారు. ఈ మేరకు సచివాలయంలోని ఏయే శాఖలను ఏపీ అధీనంలోని బ్లాకులకు తరలించాలనే అంశంపై వారం రోజులుగా చర్చలు కూడా జరిగాయి.
ఏపీకి హెర్మిటేజ్ బిల్డింగ్..! ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో రెండు రాష్ట్రాలు..!!
తెలంగాణ శాసనసభకు ఎదురుగా ఉన్న ఆదర్శ్నగర్లోని హెర్మిటేజ్ బిల్డింగ్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేటాయిస్తూ తెలంగాణ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో హైదరాబాద్ మహానగర అభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) అధికారులు భవనాన్ని ఖాళీచేయిస్తున్నారు. సచివాలయంలో ఏపీకి కేటాయించిన భవనాలను ఆ రాష్ట్ర సర్కారు తెలంగాణకు అప్పగించిన నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. హెర్మిటేజ్ బిల్డింగ్లో 72,255 చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయాలు అందుబాటులో ఉన్నాయి. హెచ్ఎండీఏ అధికారులు ఈ భవనంలోని కార్యాలయాల నుంచి ప్రతి చదరపు అడుగుకూ 50-60 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారు. దీన్ని ఏపీకి కేటాయించడంతో హెచ్ఎండీఏకు కేవలం నాలుగు కమర్షియల్ భవనాలు (మైత్రీవనం, మైత్రీవిహార్, హెచ్ఎండీఏ కమర్షియల్, స్వర్ణజయంతి కాంప్లెక్స్) మాత్రమే మిగలనున్నాయి. హెర్మిటేజ్ భవన్ను కలుపుకొని హెచ్ఎండీఏకు ప్రతినెల అద్దెరూపంలో 20 కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరేది.
శాఖలన్నీ హెచ్వోడీ ఆఫీసులకు.! లేదా కమిషనరేట్లకు, డైరెక్టరేట్లకు!
ఏ శాఖ ఎక్కడికి? శాఖ తరలించే ప్రదేశం ఇదే.. 1)రెవెన్యూ, నాంపల్లి సీసీఎల్ఏ. 2)రిజిస్ట్రేషన్, ఐజీ కార్యాలయం, ఎంజే మార్కెట్. 3)విద్యా శాఖ, సైఫాబాద్ పాఠశాల విద్య డైరెక్టరేట్. 4)ఎస్సీ, ఎస్టీ, మాసాబ్ట్యాంక్. 5)బీసీ సంక్షేమ శాఖలు, దామోదరం సంజీవయ్య సంక్షేమభవన్. 6)నీటిపారుదలఎర్రమంజిల్ ఈఎన్సీ కార్యాలయం. 7)పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ, ఎర్రమంజిల్ ఈఎన్సీ కార్యాలయాలు. 8)అటవీ శాఖ, సైఫాబాద్ అరణ్యభవన్. 9)కార్మిక శాఖ, ఆర్టీసీ క్రాస్రోడ్డులోని అంజయ్యభవన్.10)సాధారణ పరిపాలన, బీఆర్కేఆర్ భవన్.11)వైద్యఆరోగ్య శాఖ, కోఠిలోని వైద్యవిధాన పరిషత్. 12)వ్యవసాయ శాఖ, బషీర్బాగ్లోని వ్యవసాయ కమిషనరేట్.13)సివిల్ సప్లైస్, ఎర్రమంజిల్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్. 14.రవాణా శాఖ, ఖైరతాబాద్ ఆర్టీఏ కార్యాలయం.15)పోలీసు శాఖ, లక్డీకాపూల్ డీజీపీ కార్యాలయం. 16)పరిశ్రమలు, అబిడ్స్లోని పరిశ్రమలశాఖ కమిషనరేట్.