ఏఏపీ నేతకు కేసీఆర్ 'వాస్తు' షాక్!: కోర్టు జరిమానా
హైదరాబాద్: తెలంగాణ సచివాలయాన్ని వాస్తు దోషం కారణంగా ఎర్రగడ్డకు మార్చాలని ప్రభుత్వ నిర్ణయించిందని, ఈ విషయంలో జోక్యం చేసుకొని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూడాలని కోరుతూ దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు మంగళవారం కొట్టివేసింది.
వాస్తు దోషం వల్లనే సచివాలయం మార్పు అనే దానికి ఆధారం లేదని న్యాయస్థానం పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి కళ్యాణ్ జ్యోతి సేన్ గుప్తా, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను కొట్టివేసింది. కోర్టు సమయాన్ని వృథా చేశారని పిటిషన్దారుకు కోర్టు రూ.వెయ్యి జరిమానా విధించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు మహమూద్ అలీ వాస్తు కోసం సచివాలయాన్ని మారుస్తూ 150 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని హైకోర్టులో పిటిషన్ వేశారు. దీంతో, సచివాలయం మార్పునకు సంబంధించిన ఫైళ్లను మంగళవారం నాటికి కోర్టుకు సమర్పించాలని హైకోర్టు ఆదేశించడంతో అడ్వకేట్ జనరల్ వివరాలు అందజేశారు.
వివరాలను పరిశీలించిన వాస్తు అనే అంశం ఎక్కడా లేదని కోర్టు స్పష్టం చేసింది. దీంతో పిటిషన్దారు పైన కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎక్కడి నుండి సమాచారం పొంది వాస్తుదోషం అన్నారని కోర్టు ప్రశ్నించగా.. పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా పిల్ వేసినట్లు తెలిపారు.
ఆయన సమాధానంతో సంతృప్తి చెందని న్యాయస్థానం.. సంచనలం సృష్టించి వార్తల్లో నిలవాలనే ఉద్దేశంతో పిల్ దాఖలు చేసినట్టు అభిప్రాయపడింది. దీంతో అతనికి వెయ్యి రూపాయల జరిమానా విధించింది. సమాచారం సేకరించేందుకు సమాచార హక్కు చట్టాన్ని వినియోగించుకోవాలని సూచించింది. అన్ని విభాగాల కార్యనిర్వాహక అధికారులతో చర్చించాకే, సచివాలయ మార్పుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లుగా కనబడుతోందని పేర్కొంది.