దశ తిరిగిన 'కంటోన్మెంట్' బోర్డు.. 10 కోట్లకు పైగా "టోల్" టెండర్
హైదరాబాద్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డుకు కలిసొచ్చింది. నిధుల కొరతతో సతమతమవుతున్న బోర్డుకు "టోల్ టెండర్లు" మోక్షం కలిగించాయి. టోల్ ట్యాక్స్ వసూళ్ల కోసం టెండర్లు ఆహ్వానించడంతో జాక్ పాట్ కొట్టేసింది. ఎన్నడూ లేనంతగా ఈసారి 10 కోట్ల 70 లక్షల 99వేల 999 రూపాయల బిడ్ దాఖలు కావడం విశేషం. ఇంత పెద్ద మొత్తంలో టెండర్ రావడం ఇదే మొదటిసారి. గతేడాది కన్నా 4 కోట్ల రూపాయలకు పైగా బిడ్ దాఖలు చేసింది మోర్గాన్ ఎంటర్ప్రైజెస్ సంస్థ.
అన్నీ పెద్దమొత్తాలే..!
2019-20 కాలానికి గాను నిర్వహిస్తున్న టోల్ ట్యాక్స్ టెండర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పెద్ద మొత్తాలతో మూడు టెండర్లు దాఖలు కావడం విశేషం. వాస్తవానికి 5 టెండర్లు దాఖలయినా.. నిబంధనల ప్రకారం లేవని రెండింటినీ తిరస్కరించారు బోర్డు అధికారులు. అయితే 10,70,99,999 రూపాయలతో అత్యధికంగా బిడ్ దాఖలు చేసిన మోర్గాన్ సంస్థకు ఈసారి అవకాశం దక్కనుంది. 2018-19 కాలానికి టెండర్ దక్కించుకున్న ఎస్ డీ అడోబ్స్ ఈసారి 6,47,99,999 రూపాయలకు బిడ్ వేసింది. బాలాజీ ఎంటర్ ప్రైజెస్ అనే మరో సంస్థ 9,23,45,678 రూపాయలకు బిడ్ దాఖలు చేసింది.
వన్ ఇయర్ కాంట్రాక్ట్
అత్యధికంగా బిడ్ దాఖలు చేసిన మోర్గాన్ ఎంటర్ప్రైజెస్ సంస్థకు ఏడాది పాటు టోల్ ట్యాక్స్ వసూలు చేసే బాధ్యత అప్పగించనుంది కంటోన్మెంట్ బోర్డు. దీంతో కమర్షియల్ వెహికిల్స్ నుంచి బోర్డు నిర్దేశించిన ధరల మేరకు టోల్ ట్యాక్స్ వసూలు చేయాల్సివుంటుంది సదరు సంస్థ.
10 కోట్లతో కష్టాలు తీరేనా?
గతేడాది టోల్ ట్యాక్స్ వసూళ్ల కాంట్రాక్ట్ నవంబర్ 17వ తేదీన ముగియాల్సి ఉంది. ముందస్తు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వీలుకాక ఆ గడువు కాస్తా పొడిగించారు. అయితే డిసెంబర్ 21న ఆన్లైన్ టెండర్లు ఆహ్వానించడంతో 5 దాఖలయ్యాయి. అందులో రెండు రిజెక్ట్ కాగా మరో మూడింటిని ఓపెన్ చేశారు. ఇందులో మోర్గాన్ సంస్థ 10 కోట్లకు పైగా బిడ్ దాఖలు చేయడంతో ఆ సంస్థకే టోల్ ట్యాక్స్ వసూళ్ల కాంట్రాక్ట్ అప్పగించనుంది బోర్డు. గతేడాది కాంట్రాక్ట్ దక్కించుకున్న ఎస్ డీ అడోబ్స్ త్వరలోనే టోల్ ట్యాక్స్ వసూళ్లను నిలిపివేయాల్సి ఉంటుంది. మొత్తానికి 10 కోట్లకు పైగా ఆర్థిక వనరులు సమకూరనుండటంతో... కంటోన్మెంట్ బోర్డు కష్టాలు కొంతలో కొంత తీరినట్లేననే వాదన వినిపిస్తోంది.