మౌలాలి రైల్వే స్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం: పూర్తిగా దగ్ధమైన రైలు బోగీ
హైదరాబాద్: సికింద్రాబాద్ రైల్వే పరిధిలోని మౌలాలి రైల్వేస్టేషన్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఆగివున్న రైల్వే బోగీలో మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో రైలు బోగీ పూర్తిగా దగ్ధమైంది.
కాకినాడ నుంచి సికింద్రాబాద్కు. .
రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాకినాడ టౌన్ నుంచి సికింద్రాబాద్ వచ్చే స్పెషల్ రైలు(నెం. 07054) శనివారం తెల్లవారుజాము 4.30గంటలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు చేరుకుంది. ప్రయాణికులంతా దిగిన తర్వాత రైలును మౌలాలి యార్డుకు తరలించారు.
మంటలు వ్యాపించడంతో..
శనివారం ఉదయం 10.30 గంటల సమయంలో రైలులోని రెండో బోగీలో పొగలు రావడాన్ని గమనించిన మౌలాలి ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ ఉస్మాన్.. వెంటనే రైల్వే ఉన్నతాధికారులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించాడు. మల్లాపూర్, చర్లపల్లి నుంచి వచ్చిన మూడు ఫైరింజిన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి.
పూర్తిగా దగ్ధమైన బోగి..
అయితే, అప్పటికే మంటలు వేగంగా అంటుకోవడంతో ఓ బోగి పూర్తిగా దగ్ధమైంది. మరో బోగి పాక్షికంగా కాలిపోయింది. సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం ఆధారాలు సేకరించింది. బోగీలో ఓ మద్యం సీసా, కాల్చిపారేసిన సిగరేట్ ముక్కలు, అగ్గిపెట్టేను క్లూస్ టీం బృందం సేకరించింది.
ఏం జరిగిం ఉంటుంది?
మంటలు మిగితా బోగీలకు వ్యాపించకపోవడం వల్ల భారీ నష్టం వాటిల్లలేదని అధికారులు తెలిపారు. రైలు నిలిపి ఉండటంతో విద్యుత్ ఘాతానికి గురయ్యే అవకాశామే లేదన్న రైల్వే అధికారులు.. ఇతర కారణాలతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.