ఏం మారింది?: 'మిలియన్ మార్చ్' టెన్షన్.. ట్యాంక్ బండ్ అష్టదిగ్బంధం
హైదరాబాద్: 2011 మార్చి 10.. 'మిలియన్ మార్చ్'తో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడ్డ దినం. ఆంక్షల పద్మవ్యూహాన్ని బద్దలుకొట్టుకుని లక్షలాదిగా తరలివచ్చిన తెలంగాణ జనంతో ఆరోజు ట్యాంక్ బండ్ కిక్కిరిసిపోయింది.
ఎన్ని నిర్బంధాలు ప్రయోగించినా.. ఎంత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినా.. ఆనాడు 'మిలియన్ మార్చ్' ధాటికి పోలీసులు సైతం ప్రేక్షక పాత్ర వహించక తప్పలేదు. ఇంతటి నేపథ్యమున్న 'మిలియన్ మార్చ్' ఇప్పుడు మరోసారి చర్చనీయాంశమైంది.
టీజేఏసీ చైర్మన్ కోదండరాం తలపెట్టిన 'మిలియన్ మార్చ్ స్ఫూర్తి'కి ప్రభుత్వం అనుమతినివ్వకపోవడంతో ప్రజల్లో వాడి వేడి చర్చ జరుగుతోంది. మరోవైపు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాలను తెలంగాణ ప్రభుత్వం అష్టదిగ్బంధనం చేయడం గమనార్హం.
ఎందుకీ 'మిలియన్ మార్చి స్ఫూర్తి' సభ
ఉద్యమ కాలంలో ఆనాడు ప్రజలందరు కలిసి అద్భుతంగా విజయవంతం చేసిన కార్యక్రమం మిలియన్ మార్చ్. ఉద్యమకారులకు, ప్రజలకు అదో మానసిక స్థైర్యాన్ని ఇచ్చింది.
అలాంటి చారిత్రక సందర్భాన్ని మరోసారి గుర్తుచేసుకుని స్ఫూర్తి పొందేందుకు కోదండరాం 'మిలియన్ మార్చ్ స్ఫూర్తి' సభను తలపెట్టారు. విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు, వామపక్షాలు ఇందుకు మద్దతు పలికాయి.
ఇప్పుడెందుకు?
రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరగడం, రైతుల ఆత్మహత్యలు పెరుగుతున్న నేపథ్యంలో.. ఆనాటి స్ఫూర్తిని మరోసారి రగిలించి వారిలో మానసిక స్థైర్యాన్ని నింపేందుకు ఈ కార్యక్రమం చేపట్టామని కోదండరాం అంటున్నారు. ఇందుకోసం ట్యాంక్ బండ్ పై ఉన్న మొఖ్దం మొహీయుద్దీన్ విగ్రహం వద్ద ఆట పాట.. సభానంతరం ఊరేగింపు ప్లాన్ చేసుకున్నట్టు వివరించారు.
ఏం మారింది?
ఆనాడు ఉమ్మడి రాష్ట్ర పాలకులు తెలంగాణ ఉద్యమాన్ని అణచివేస్తే.. ఈనాడు సొంత రాష్ట్రంలోనూ నిర్బంధాలను ఎదుర్కోవాల్సిన దుస్థితి తలెత్తిందని కోదండరాం అన్నారు.
అప్పటికీ ఇప్పటికీ ఏమి మారలేదన్నారు. టీజేఏసీ నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడాన్ని ఆయన ఖండించారు. 'మిలియన్ మార్చ్ స్ఫూర్తి' సభపై శనివారం ఉదయం ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలతో భేటీ అవుతున్నట్టు తెలిపారు.
ఇదేనా న్యాయం
రాష్ట్రాల హక్కులు హరిస్తున్నారంటూ సీఎం కేసీఆర్.. కేంద్రాన్ని నిలదీయవచ్చు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నాలు చేయవచ్చు. కానీ రాష్ట్ర ప్రజలు మాత్రం తమ ఆకాంక్షలను చెప్పుకోవద్దా?.. సభలు, సమావేశాలు నిర్వహించుకోవద్దా? అని కోదండరాం ప్రశ్నించారు. ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
ట్యాంక్ బండ్ దిగ్బంధం
మిలియన్ మార్చ్ స్ఫూర్తి సభ నేపథ్యంలో ట్యాంక్ బండ్ చుట్టూ వేలాది పోలీసులను మోహరించింది ప్రభుత్వం. ఉదయం 11గం. నుంచి సాయంత్రం 5గం. వరకు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించింది. అలాగే చుట్టుపక్కల ఉన్న లుంబినీ, ఎన్టీఆర్, లేక్ వ్యూ, సంజీవయ్య పార్కులను కూడా మూసివేయించింది. ట్యాంక్ బండ్ ఎలాంటి సభలకు అనుమతి లేదని, ఒకవేళ ఎవరైనా అందుకు ప్రయత్నిస్తే అరెస్టులు తప్పవని పోలీసులు హెచ్చరించారు.