ఢిల్లీ జెఎన్యులో అఫ్జల్గురు వివాదం: హైద్రాబాద్లో ఎస్ఎఫ్ఐ వర్సెస్ ఏబీవీపీ
న్యూఢిల్లీ/హైదరాబాద్: ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఇటీవల విద్యార్థులు ఉగ్రవాది అఫ్జల్ గురు ఉరితీతను నిరసిస్తూ ఓ సభను నిర్వహించారు. దీనికి సంబంధించి కన్నయ్య అనే వ్యక్తిని అరెస్టు చేశారు. దీనిపై రాజకీయ దుమారం చెలరేగుతోంది.
జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జెఎన్యు) వివాదంపై అధికార, విపక్షాలు శనివారం నాడు పరస్పరం మాటల దాడికి దిగాయి. కేంద్రంలో ప్రధాని మోడీ సర్కారు పనితీరు హిట్లర్ శకాన్ని తలపింపజేస్తోందని రాహుల్ గాంధీ మండిపడ్డారు. దానికి బిజెపి ఘటుగా స్పందించింది.
రాహుల్ గాంధీ, ఆయన అనుచరులు లష్కరే తోయిబా ఉగ్రవాది హఫీజ్ సయీద్లా మాట్లాడుతున్నారని కమలం మాప్టీ ధ్వజమెత్తింది. కన్నయ్యను విడిచిపెట్టకపోతే సోమవారం నుంచి సమ్మె చేస్తామని విద్యార్థులు హెచ్చరించారు. అనుమానిత విద్యార్థుల జాబితాలో సిపిఐ అగ్రనేత డి రాజా కుమార్తె పేరు కూడా ఉంది. ఉగ్రవాదులకు అనుకూలంగా వ్యవహరించినవారిని ఉపేక్షించబోమని కేంద్రమంత్రులు స్పష్టం చేశారు.
కాగా, ఈ వివాదం భాగ్యనగరంకు తాకింది. జెఎన్యు విద్యార్థి సంఘం అధ్యక్షుడు కన్నయ్య అరెస్టును నిరసిస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయం, హెచ్సియులో పలు విద్యార్థి సంఘాలు శనివారం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశాయి.
మరోవైపు విద్యాసంస్థల్లో జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే సహించేది లేదంటూ హెచ్సియులో ఏబీవీపీ నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. దీంతో ఏబీవీపీ, ఇతర విద్యార్థి సంఘాల నాయకుల మధ్య తోపులాటలు, వాగ్వాదం చోటుచేసుకుని ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.
ఏబీవీపీ ర్యాలీని అడ్డుకునేందుకు ఇతర సంఘాల నేతలు ప్రయత్నించగా స్వల్ప ఉద్రిక్తత తర్వాత పరిస్థితి సద్దుమణిగింది. యూనివర్సిటీలు జాతి వ్యతిరేక భావాలకు వేదిక కాకూడదని, యువతలో దేశభక్తి నింపే దేవాలయాలు కావాలని వర్సిటీ ఏబీవీపీ నేత సంపత్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఓయులోను ర్యాలీలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కన్నయ్యను అక్రమంగా అరెస్ట్ చేసిందని, విద్యార్థుల్ని సస్పెండ్ చేస్తూ విశ్వవిద్యాలయం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఓయూ ఆర్ట్స్ కళాశాల ముందు ఏఐఎస్ఎఫ్, ఎస్ఎఫ్ఐ, పీడీఎస్యూ ఆధ్వర్యంలో విద్యార్థి నేతలు కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.
దీనికి ఏబీవీపీ అభ్యంతరం తెలపడంతో ఇరు వర్గాల మధ్య వాగ్వాదం జరిగి ఉద్రిక్తతకు దారి తీసింది.దేశ దోహ్రులను హీరోలుగా చేయడానికి ప్రయత్నిస్తే అడ్డుకుంటామని ఏబీవీపీ జాతీయ నాయకుడు కడియం రాజు హెచ్చరించారు.