సీడ్ ఆఫ్ బౌల్ గా తెలంగాణా .. ఆఫ్రికా దేశాలకు విత్తన ఎగుమతి
'సీడ్ ఆఫ్ బౌల్ 'గా తెలంగాణ రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెలంగాణ రాష్ట్ర వాతావరణం, భూములు విత్తనోత్పత్తి అత్యంత అనుకూలంగా ఉన్న నేపథ్యంలో దేశ విత్తన అవసరాలను 60 శాతం తెలంగాణ రాష్ట్రం తీరుస్తుంది. దేశ విదేశాలకు చెందిన 400 ప్రముఖ కంపెనీలు తెలంగాణ రాష్ట్రం విత్తనోత్పత్తి కి అన్ని విధాలా అనుకూలంగా ఉండటంతో ఇక్కడ కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
సీడ్ విలేజ్ కార్యక్రమం ద్వారా నాణ్యమైన విత్తనాలను ఉత్పత్తి చేస్తోంది తెలంగాణ రాష్ట్రం.
దీంతో జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా విత్తనాలను ఎగుమతి చేస్తూ తెలంగాణ రాష్ట్రం తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది. వరి, మొక్కజొన్న, శనగ, వేరుశనగ, సోయాబీన్ విత్తనాల హైబ్రీడ్ రకాలను 90 శాతం తెలంగాణలోనే ఉత్పత్తి చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న విత్తన అవసరాలను తెలంగాణ రాష్ట్రం తీర్చడంతోపాటు గా, విదేశాలకు సైతం విత్తనాలను ఎగుమతి చేయడంలో ముందంజలో ఉంది. దీంతో తెలంగాణ వరి విత్తనాలపై అధ్యయనం చేయడంతో పాటు.. దిగుమతి చేసుకోవడానికి ఆఫ్రికా ప్రతినిధుల బృందం సోమవారం హైదరాబాద్కు వచ్చింది. ఈ సందర్భంగా రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ కార్యాలయంలో రాష్ట్ర అధికారులు వారితో భేటీ అయ్యి ఒప్పందం చేసుకున్నారు.
ఈ నేపథ్యంలో కమిషనర్ పార్థసారధి మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 60శాతం విత్తన అవసరాలను తెలంగాణ తీరుస్తోందన్నారు. గత ఏడాది సూడాన్, ఫిలిప్పీన్స్, రష్యా, టాంజానియా దేశాలకు విత్తనాలను ఎగుమతి చేశామని పేర్కొన్నారు. ఈ ఏడాది వేయి టన్నుల విత్తనాలు ఎగుమతి చేయనున్నట్లు ఆయన వివరించారు. ఆఫ్రికాలో విత్తనోత్పత్తి తక్కువగా ఉండటంతో తెలంగాణ నుంచి దిగుమతి చేసుకుంటున్నామని ఆఫ్రికా ప్రతినిధులు తెలిపారు. తెలంగాణ విత్తనాలు నాణ్యమైన విత్తనాలని, ఈ విత్తనాలతో దిగుబడి కూడా అధికంగా వస్తుందని విదేశాల వారు సైతం తెలంగాణ విత్తనాలపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. మొత్తానికి విత్తన భాండాగారంగా తెలంగాణ రాష్ట్రం 'సీడ్ ఆఫ్ బౌల్'గాతన సత్తా చాటుతోంది.