కెసిఆర్ ఇది గమనించారా: ఎరువుల సబ్సిడీ సరే, విత్తన ధర సంగతి...?
వచ్చే ఖరీఫ్ సీజన్కు అవసరమైన విత్తనాల ధరలు పెంచుతూ ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పంటల సేద్యానికి ప్రతికూలంగా మారనున్నది.
హైదరాబాద్: వచ్చే ఏడాది నుంచి వ్యవసాయంలో రైతులు వాడే ఎరువుల కొనుగోలుకు రూ.4000 వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. దీనివల్ల 55 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరుతుందని కూడా ప్రకటించారు. వచ్చే ఖరీఫ్ సీజన్కు అవసరమైన విత్తనాల ధరలు పెంచుతూ ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పంటల సేద్యానికి ప్రతికూలంగా మారనున్నది.
విత్తన ధరలు గత ఏడాది కంటే 40 శాతం వరకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సాధారణంగా ప్రభుత్వం పంపిణీ చేసే విత్తనాల ధరలు చాలా తక్కువగా ఉండాలి. కానీ ప్రస్తుతం బహిరంగ మార్కెటల్లో నాణ్యమైన మేలురకం విత్తనాల ధరల కంటే ప్రభుత్వం ప్రకటించిన విత్తన ధరలు ఎక్కువ.
సాధారణంగా ఖరీఫ్లో పంటలు సాగు చేయాలంటే రైతులకు అధిక మొత్తంలో పెట్టుబడులు అవసరం. ఇటీవల కందులకు మద్దతు ధర లభించక రైతులు పలు రకాల తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఖరీఫ్ నుంచి విత్తనాల ధరలు పెంచుతూ తాజాగా ప్రభుత్వ నిర్ణయంతో రైతుల నెత్తిపై అదనపు భారం పడనున్నది.
వచ్చే ఖరీఫ్లో కందుల సాగు అనుమానమే?
ఎరువుల భారం ప్రభుత్వం భరించేందుకు సిద్ధమైనా.. కొన్ని పంటల విత్తనాల ధరలు గత ఏడాది 20 నుంచి 30 శాతం పెంచగా ఈ సారి 40 శాతం మేర పెంచడం వల్ల రైతుల పంటల సాగు ఖర్చు పెరిగిపోనున్నది. దీంతో ఖరీఫ్ సీజన్లో రైతులు కందులు సాగు చేస్తారా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మినుము, జనుము, పిల్లి పెసర, జీలుగ విత్తనాల ధరలు కూడా పెరిగాయి. సాధారణ పంటల సాగుకు ముందు జూన్ నెలలో తొలకరి చినుకులు కురిసిన వెంటనే భూసారాన్ని పెంచేందుకు మినుము, జనుము, పిల్లి పెసర, జీలుగ విత్తనాలు వేస్తారు. వీటి ధర పెరగడంతో రైతులు ఆయా పంటలు సాగు చేసేందుకు వెనుకడుగు వేస్తే భూములు సారం కోల్పోయే అవకాశం ఉన్నదని చెప్తున్నారు.
సబ్సిడీ విత్తనాల ధరలు గత ఏడాది ఇలా..
గత ఏడాది రైతులకు సబ్సిడీపై కంది విత్తనాలు క్వింటాలుకు రూ.6,210 ఉండగా, ఈ ఏడాది ఏకంగా రూ.8,365 కు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. మినుములు రూ.5475 నుండి రూ.6783కు, పిల్లి పెసర రూ.4850 నుండి రూ.5850 కి పెంచారు. వీటిలో ప్రభుత్వం కేవలం 31 శాతం మాత్రమే సబ్సిడీ భరిస్తుంది.
మొక్కజొన్న, జొన్న, సజ్జ, ఆముదం, పొద్దుతిరుగుడు విత్తనాల ధరలపై రూ.2500 సబ్సిడీ ఇస్తుంది. కాగా వరి విత్తనాల ధర మార్కెట్లో ఎంత ఉన్నప్పటికీ కొత్త వంగడాలు రూ.1000 వరకు ప్రభుత్వం సబ్సిడీ భరిస్తుంది. పదేళ్ల కంటే పైబడిన పాత విత్తనాల కంటే రూ.500 సబ్సిడీ ఇస్తుంది. తాజాగా పెరిగిన ధరలతో ఈ సబ్సిడీలు ఉంటాయా లేదా అనేది సందేహంగా మారింది.
మార్కెట్ ధరల కంటే అధికం ...
ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై అందిస్తున్న విత్తనాల ధరల కంటే మార్కెట్లో మేలు రకం ధాన్యం ధరలే తక్కువగా ఉన్నాయి. రైతులు పండించిన మేలురకం విత్తనాలు వేరు చేసిన వాటినే విత్తన సంస్థలు ప్రభుత్వం సరఫరా చేసే సబ్సిడీ విత్తనాలుగా వారికే విక్రయిస్తున్నాయి. రైతులు పండించిన విత్తనాలను సేకరించి వాటిని రసాయనాలతో ప్రాసెసింగ్ చేసి సరఫరా చేస్తారు. ప్రస్తుతం రైతులు మార్కెట్కు తెచ్చిన మేలైన ధాన్యానికి పలుకుతున్న ధరల కంటే చాలా ఎక్కువగా విత్తనాల ధరలు నిర్ణయించి ప్రభుత్వమే రైతులను దోపిడీ చేసేందుకు అవకాశం కల్పిస్తున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
అధిక ధరలకు ప్రభుత్వం సరఫరా చేసే సబ్సిడీ విత్తనాల కంటే రైతులు పండించిన పంటలో నాణ్యమైన వాటిని వేరు చేసి ఆ తర్వాత విత్తనాలుగా ఉపయోగించుకుంటేనే మేలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒక్క జనగామ జిల్లాలోనే 1.56 లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణం కాగా కంది, వరి పంటతో పాటు మెట్ట పంటలు సాగు చేస్తున్నారు.
రమారమీ రాష్ట్రంలోని 30 జిల్లాల పరిధిలో 40 లక్షల హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేస్తారు. రైతుల ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో విత్తనాల ధరలు పెరగడం ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోనున్నారు. విత్తనాల ధరలు ఖరారు కావడంతో వచ్చే ఖరీఫ్ సీజన నుంచి విక్రయాలు జరిపేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.